Chandrababu: ముస్తాబౌతున్న చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక

Chandrababu

Chandrababu

Chandrababu: కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక సిద్ధమవుతోంది. సభా వేదిక పనులు దగ్గరుండి అధికారులు, టీడీపీ నాయకులు పరివేక్షిస్తున్నారు. ఈనెల 12వ తేదీ టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభా వేదిక నిర్మాణం వద్ద టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రత్యేక దళాలతో భారీ బందోబస్తు చేసేలా ప్రణాళిక ఏర్పాటు చేశారు.

ఏర్పాట్లను సీఎస్‌ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర ఐఏఎస్ లు పర్యవేక్షిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో కేసరపల్లి వద్ద గల ఐటీ పార్క్, మేధా టవర్స్ నేషనల్ హైవే పక్కన ఉన్న పొట్లూరి బసవరావు స్థలంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం రాష్ట్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు మంత్రులతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారం ‌ఏర్పాట్లపై విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాణ స్వీకార సభకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత ‌అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. . అతిథులుగా వచ్చిన వారికి, సభాస్థలికి విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.

Read Also: Modi Cabinet: కేంద్ర మంత్రి వర్గంలో ఏపీ బీజేపీకి దక్కిన చోటు..

సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. సీఎం ప్రమాణ స్వీకార ఏర్పాట్ల కోసం ఐదుగురు ఐఏఎస్‌ల బృందాన్ని సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) నియమించింది. బృందంలో సభ్యులుగా ఐఏఎస్‌ అధికారులు బాబు.ఏ, హరి జవహర్ లాల్, కన్నబాబు, సీహెచ్ హరికిరణ్, వీర పాండియన్‌లు ఉన్నారు. తదుపరి ఆదేశాల కోసం జీఏడీ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఎదుట ఐదుగురు ఐఏఎస్‌లు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.