Ind- Pak: జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో పాకిస్థానీ క్వాడ్కాప్టర్లను నేలకూల్చేందుకు శుక్రవారం నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వద్ద కాపలాగా ఉన్న ఆర్మీ దళాలు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అయితే, బాల్నోయ్-మెంధార్, గుల్పూర్ సెక్టార్లలోని భారత భూభాగంపై కొద్దిసేపు పాక్ కు చెందిన డ్రోన్లు ఎగిరిన తర్వాత దాయాది దేశంలోకి తిరిగి వెళ్లిపోయినట్లు చెప్పారు. క్వాడ్కాప్టర్ల ద్వారా ఆయుధాలు లేదా మాదక ద్రవ్యాలు కింద పడకుండా చూసేందుకు రెండు విభాగాల్లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.
Read Also: UPI NPI Linkage: నేపాల్ ఎన్పీఐతో యూపీఐ లింక్.. ఇక పేమెంట్స్ ఈజీ
ఇక, ఇవాళ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో మెంధార్- బల్నోయి ప్రాంతంలోకి రెండు డ్రోన్లు ప్రవేశించడాన్ని గమనించిన భారత సైనికులు కాల్పులు జరిపారు. అయితే, గుల్పూర్ సెక్టార్లో తిరుగుతున్న రెండు క్వాడ్కాప్టర్లు భారత సైనికుల కాల్పులను ఎదుర్కొని తిరిగి వచ్చినట్లు తెలిపారు. అయితే, అంతకుముందు ఫిబ్రవరి 12వ తేదీన మెంధార్ సెక్టార్లోని మాన్కోట్ ప్రాంతంలో పాకిస్థాన్ దేశానికి చెందిన డ్రోన్ కదలికలను గుర్తించిన తర్వాత ఆర్మీ దళాలు దానిపై కాల్పులు చేసినట్లు పేర్కొన్నాయి. జమ్మూకశ్మీర్లో మాదక ద్రవ్యాలు, ఆయుధాలను సరఫరా చేసేందుకు పాకిస్థాన్ డ్రోన్లను ఉపయోగిస్తోంది. దీంతో అలర్ట్ అయిన జమ్మూ కాశ్మీర్ పోలీసులు , పాకిస్థాన్ నుంచి ఆయుధాలు, మాదకద్రవ్యాలను తీసుకొచ్చే డ్రోన్ల గురించి సమాచారం అందించిన వారికి 3 లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తామని ప్రకటించారు.