Apple Products: బిగ్‌షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..

Apple Ipad

Apple Ipad

గ్లోబల్ సప్లై చైన్‌లో మెమొరీ భాగాల ధరలు విపరీతంగా పెరగడం వల్ల యాపిల్ సంస్థ భారతదేశంలో తన మ్యాక్‌బుక్, ఐప్యాడ్ ధరలను భారీగా పెంచింది. కొన్ని మోడళ్లపై ఏకంగా రూ. 1 లక్ష వరకు ధర పెరిగింది. ఈ ధరల పెరుగుదల అనివార్యమని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ముందే సూచించగా.. ప్రస్తుతం పెరిగిన కొత్త ధరలు యాపిల్ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి.

మ్యాక్‌బుక్ కొత్త ధరల వివరాలిలా..
మ్యాక్‌బుక్ ఎయిర్ 13-ఇంచ్ (M5).. దీని లాంచ్ ధర రూ. 1,19,900 కాగా, ఇప్పుడు రూ. 30,000 పెరిగి రూ. 1,49,900 కి చేరింది. మ్యాక్‌బుక్ ఎయిర్ 15-ఇంచ్.. దీని ధర రూ. 1,44,900 నుండి రూ. 35,000 పెరిగి రూ. 1,79,900 అయింది. మ్యాక్‌బుక్ ప్రో 14-ఇంచ్.. దీనిపై ఏకంగా రూ. 70,000 పెరిగింది. లాంచ్ ధర రూ. 1,69,900 ఉండగా, ఇప్పుడు రూ. 2,39,900 కి చేరింది. మ్యాక్‌బుక్ ప్రో 14-ఇంచ్.. దీనిపై అత్యధికంగా రూ. 1,00,000 (లక్ష రూపాయలు) ధర పెరిగింది. మ్యాక్‌బుక్ నియో.. విద్యార్థులను ఉద్దేశించి తెచ్చిన ఈ బడ్జెట్ లాప్‌టాప్ ధర రూ. 69,900 నుంచి రూ. 10,000 పెరిగి రూ. 79,900 కి చేరింది.

ఐప్యాడ్ కొత్త ధరల వివరాలు..
ఐప్యాడ్ ఎయిర్ 11-ఇంచ్ (M4).. దీని ధర రూ. 64,900 నుంచి రూ. 25,000 పెరిగి రూ. 89,900 కి చేరింది. ఐప్యాడ్ ప్రో (256GB, M5).. గత ఏడాది రూ. 99,990 కి లాంచ్ అవ్వగా, ఇప్పుడు రూ. 39,910 పెరిగి రూ. 1,39,900 కి చేరింది.

ధరల పెరుగుదలకు కారణం..
యాపిల్ ఉత్పత్తులలో వాడే హై-పెర్ఫార్మెన్స్ మెమొరీ మోడ్యూల్స్ (RAM) ధరలు అంతర్జాతీయ మార్కెట్లో మునుపెన్నడూ లేనంత వేగంగా పెరిగాయి. దీనిపై యాపిల్ స్పందిస్తూ.. ‘మేము ఇంతవరకు ఈ భారాన్ని వినియోగదారులపై పడకుండా కాపాడుకుంటూ వచ్చాము, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు పెంచక తప్పలేదు’ అని తెలిపింది. భారతదేశంతో పాటు అమెరికా మార్కెట్లో కూడా యాపిల్ తమ ఉత్పత్తుల ధరలను పెంచింది. సైబర్ మీడియా రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రభు రామ్ అభిప్రాయం ప్రకారం.. యాపిల్ లాంటి పెద్ద సంస్థే ధరలు పెంచిందంటే, రాబోయే రోజుల్లో ఇతర ఎలక్ట్రానిక్ బ్రాండ్స్ కూడా ధరలు పెంచే అవకాశం ఉంది. ఈ నిర్ణయం విద్యార్థులు, ప్రొఫెషనల్స్ కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపనుంది.