ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ , వార్డు సచివాలయ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కూటమి సర్కార్ ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ.. ఉద్యోగుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా ‘గ్రామ, వార్డు సచివాలయాల’ పేరును ‘స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు’ కార్యాలయాలుగా మారుస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనమండలి తాజాగా ఆమోదం తెలిపింది.
సచివాలయ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల్లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు త్వరలోనే ప్రమోషన్లు కల్పించనున్నట్లు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఒకే హోదాలో నిలిచిపోయిన వేలాది మంది ఉద్యోగులకు ఈ నిర్ణయం కెరీర్ పరంగా పెద్ద ఊరటనివ్వనుంది.
Also Read:Railway Station: తెలంగాణలో ఆ రైల్వే స్టేషన్కు మహర్దశ.. విమానాశ్రయం తరహాలో అభివృద్ధి..
ప్రజలకు అందే సేవల్లో జాప్యం తగ్గించి, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం మూడంచెల (Three-tier) పర్యవేక్షణ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. దీని ద్వారా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిరంతర నిఘా ఉంటుంది. గతంలో పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు దారిమళ్లాయని, ఇప్పుడు ఆ నిధులను నేరుగా పంచాయతీలకే కేటాయించి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
సచివాలయాలను కేవలం రాజకీయ కేంద్రాలుగా కాకుండా, ప్రజల అవసరాలు తీర్చే నిజమైన సేవా కేంద్రాలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను ‘స్వర్ణాంధ్ర’గా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగానే ఈ సంస్థాగత మార్పులు జరుగుతున్నాయి.
గతంలో వాలంటీర్ల ద్వారా జరిగిన పెన్షన్ల పంపిణీని.. ప్రస్తుతం ప్రజాప్రతినిధులే నేరుగా లబ్ధిదారులకు అందించడం ద్వారా వ్యవస్థలో మరింత పారదర్శకత వచ్చిందని ప్రభుత్వం భావిస్తోంది. అవినీతి రహిత పాలనను అందిస్తూ.. ప్రతి పౌరుడికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడటమే ఈ ‘స్వర్ణ’ విప్లవం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ మార్పులు ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, గ్రామీణ స్థాయిలో పాలనా యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా తయారు చేయనున్నాయి.
