Site icon NTV Telugu

SSC Exam: ‘పది’ విద్యార్థులకు శుభవార్త.. ప్రతి ఒక్కరికీ 7 మార్కులు కలిపేందుకు బోర్డు నిర్ణయం..

10TH EXAMS

10TH EXAMS

ఏపీ పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (SSC) బోర్డు ఊరటనిచ్చే వార్త చెప్పింది. ఇటీవల జరిగిన వార్షిక పరీక్షల్లో కొన్ని ప్రశ్నల విషయంలో తలెత్తిన అస్పష్టతను పరిగణనలోకి తీసుకున్న బోర్డు, విద్యార్థులకు మొత్తం 7 మార్కులను గ్రేస్ మార్కులుగా కలపాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్, హిందీ సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లోని పొరపాట్ల వల్ల విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ అదనపు మార్కులను కేటాయిస్తున్నారు.

నిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా.. ఇంగ్లీష్ పేపర్‌లో 5 మార్కులు, హిందీ పేపర్‌లో 2 మార్కులు కలపనున్నారు. ఈ సందిగ్ధ ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు ప్రయత్నించిన విద్యార్థులందరికీ ఈ ప్రయోజనం చేకూరుతుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు (DEOs) , స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలకు బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు రాసిన సుమారు 6.40 లక్షల మంది విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరగడమే కాకుండా, వారికి మెరుగైన గ్రేడింగ్ వచ్చే అవకాశం ఉంది.

Also Read:Hydra: ‘ఆ ఇళ్ల జోలికి వెళ్లం’.. గుడ్ న్యూస్ చెప్పిన హైడ్రా..

అయితే.. మరికొన్ని ప్రశ్నల్లో కూడా తప్పులు దొర్లాయని తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తిని బోర్డు సున్నితంగా తిరస్కరించింది. ఆ ప్రశ్నలు విద్యార్థుల మేధస్సును పరీక్షించే కోణంలోనే ఇచ్చామని, వాటిలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని అధికారులు వివరణ ఇచ్చారు. కాగా, ఏప్రిల్ 6 నుంచి సమాధాన పత్రాల మూల్యాంకనం (Spot Valuation) ప్రారంభమై 15వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ప్రక్రియ వేగంగా పూర్తి చేసి, ఏప్రిల్ చివరి నాటికి తుది ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది.

Exit mobile version