AP Rain Alert for Next Two Days: వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో వాతావరణం ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలాగే సముద్రం అలజడిగా మారి అలలు ఎగసిపడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు కూడా వాతావరణ పరిస్థితులను గమనిస్తూ సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. తీర ప్రాంతాల్లో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి అనిత సూచించారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తీర ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

