గోదావరి నది కాలుష్యానికి కారణమవుతోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్పై జిల్లా యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణకు సంబంధించి ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గోదావరి నది కాలుష్యంపై స్పందించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఏపీ పేపర్ మిల్స్ యాజమాన్యానికి పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో మార్పు కనిపించలేదన్నారు. గోదావరి కాలుష్య నివారణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కాలుష్య నియంత్రణ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ద్వారా ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
ఇక పేపర్ మిల్లుకు సంబంధించిన పన్నుల బకాయిల అంశంపై కూడా స్పందించిన కలెక్టర్, బకాయిల వసూళ్లకు సంబంధించి పలు కేసులు న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతూ, చట్టపరమైన చర్యలను ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడించారు.

