ఆంధ్రప్రదేశ్లో తమ స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా విధులు బహిష్కరిస్తున్న జూనియర్ డాక్టర్లు, రేపటి నుంచి అత్యవసర సేవలను కూడా నిలిపివేసేందుకు నిర్ణయించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సమ్మె నివారణపై ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక శాఖతో చర్చించి తదుపరి నిర్ణయం వెలువరిస్తామని జూడాలకు స్పష్టం చేసింది.
అయితే వారు సమ్మె విరమించేందుకు సిద్ధపడకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలకు వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు పూర్తి చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఎలాంటి వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చూసేందుకు వైద్యులందరి అన్ని రకాల సెలవులను రద్దు చేస్తూ వైద్య విద్య సంచాలకులు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.
పరిస్థితిని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ సెకండరీ ఆసుపత్రులు, జిల్లా వ్యాప్త వైద్య సిబ్బందితో పాటు ఇన్ సర్వీస్ పీజీలు, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు చెందిన పీజీ వైద్యుల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర విభాగాలు, క్యాజువాల్టీ, ఐసీయూ, కీలక ఆపరేషన్లు, ప్రసవాలు. ఇతర నిరంతర చికిత్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకుండా ముందస్తుగా ప్రత్యేక బృందాలను సిద్ధం చేసింది. ప్రభుత్వ వైఖరితో రోగులకు కలుగుతున్న ఇబ్బందులను తగ్గించడమే లక్ష్యంగా అన్ని స్థాయిల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కట్టుదిట్టం చేసారు.

