ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విద్యార్థులకు, విద్యా సంస్థల యాజమాన్యాలకు సంబంధించి రెండు కీలకమైన ప్రకటనలు చేసింది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల పునఃప్రారంభాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. వాస్తవానికి ముందుగా నిర్ణయించిన టైమ్టేబుల్ ప్రకారం జూన్ ఒకటో తేదీ నుంచే కాలేజీలు తెరవాల్సి ఉంది. అయితే, జూన్ 5వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతుండటంతో, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వేసవి సెలవులను మరో ఐదు రోజుల పాటు పొడిగించారు. ఈ మేరకు జూన్ 6వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, కో-ఆపరేటివ్, కాంపోజిట్ జూనియర్ కాలేజీలకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. కేవలం రీఓపెనింగ్ తేదీ మినహా అకడమిక్ క్యాలెండర్లోని మిగిలిన కార్యక్రమాల్లో ఎలాంటి మార్పులు ఉండవు. కాగా, ఇప్పటికే ఇంటర్లో NCERT సిలబస్, CBSE విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం, 2026-27 విద్యా సంవత్సరంలో మొత్తం 232 పనిదినాలు ఉంటాయని స్పష్టం చేసింది.
మరోవైపు.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాఠశాల విద్యాశాఖ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల (SMC) పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నెల రోజుల్లోపే అన్ని పాఠశాలల్లో నూతన కమిటీలను ఎన్నుకోవాలని ఉత్తర్వులు ఇచ్చింది. పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా 12 నుంచి 25 మంది సభ్యులతో ఈ కమిటీలను ఏర్పాటు చేయాలి. ఇందులో 75 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులకు, సంరక్షకులకు అవకాశం కల్పించాలి. మిగిలిన 25 శాతంలో ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేయాలి. ఈ కమిటీలలో కచ్చితంగా 50 శాతం మహిళలు ఉండాలని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన ప్రాధాన్యం ఇవ్వాలని నిబంధన విధించింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మెంబర్ కన్వీనర్గా వ్యవహరించే ఈ కమిటీలు, స్కూల్ అభివృద్ధి మరియు పర్యవేక్షణ కోసం నెలకు ఒకసారి విధిగా సమావేశం కావాల్సి ఉంటుంది.
