Vallabhaneni Vamshi: వల్లభనేని వంశీకి హైకోర్టు షాక్!

  • ఏపీ హైకోర్టులో వల్లభనేని వంశీకి షాక్
  • బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
  • టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా వంశీ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా ఉన్న వంశీ.. ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. బెయిల్ మంజూరు చేసేది లేదంటూ స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని సూచించింది.

ఇటీవల దళిత యువకుడు సత్యవర్ధన్‌ కిడ్నాప్‌, దాడి కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వంశీ విజయవాడలోని జిల్లా సబ్ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఇక మంగళవారం జైలులో ఉన్న వంశీని ములాఖత్‌లో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు వంశీతో జగన్‌ మాట్లాడారు. జగన్ వెంట వంశీ సతీమణి పంకజశ్రీ, సింహాద్రి రమేష్ జైలు లోపలికి వెళ్లారు.