ఏపీ ప్రభుత్వం గ్యారెంటీ పెన్షన్ స్కీం-GPS చట్టాన్ని అమలు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. కానీ.. ఇది టీడీపీ ప్రభుత్వం విడుదల చేసింది కాదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసింది. అయితే ఈ జీపీఎస్కు సంబంధించిన ఫైల్పై గత నెల 12న అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఆయన సెలవుపై వెళుతూ పెండింగ్ ఫైల్స్పై సంతకాలు పెట్టారు. ఈ ఫైల్స్లో జీపీఎస్కు సంబంధించిన ఫైల్ కూడా ఉందట. ఈ జీపీఎస్ కు సంబంధించి జూన్ 12న జీవో 54ను విడుదల చేయగా.. పాత ప్రభుత్వంలోనే రూపొందించిన ఈ నోటిఫికేషన్ను శుక్రవారం గెజిట్లో అప్లోడ్ చేయడంతో ఆందోళన మొదలైంది. ఈ గెజిట్లో జీపీఎస్ గతేడాది అక్టోబరు 20 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొనడం విశేషం.
జీపీఎస్పై ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి.. గతేడాది అక్టోబరు నుంచి అమల్లోకి వస్తుందనడంపై ఉద్యోగులు షాక్లో ఉన్నారు. జీపీఎస్ అమలుకు, నాడు విధివిధానాలు రూపొందించకుండా.. కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నోటిఫికేషన్ ఇవ్వడమేంటని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయంతో తమకు సంబంధం లేదని.. గత ప్రభుత్వ నిర్ణయమంటోన్న ఎన్డీఏ సర్కార్ వెల్లడించింది. తాము అధికారంలోకి వచ్చే నాటికి రావత్ సెలవులో ఉన్నారని ప్రస్తుత సర్కార్ చెబుతోంది. నెల రోజుల క్రితం జారీ చేసిన జీపీఎస్ అమలు జీవోకు ఇప్పుడు గెజిట్ విడుదల చేయడంపై యూటీఎఫ్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.