Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు.!

Retirement Age Increase

Retirement Age Increase

Retirement Age Increase: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, వివిధ సొసైటీలతో పాటు 9, 10వ షెడ్యూల్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. వారి పదవీ విరమణ వయస్సును ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులు నేరుగా ప్రయోజనం పొందనున్నారు.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ కొత్త నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs), కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఇకపై 62 ఏళ్ల వయస్సు వరకు తమ సేవలను కొనసాగించవచ్చు. అయితే 60 ఏళ్ల వయస్సులో ఇప్పటికే పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కూడా ప్రభుత్వం ఊరట కల్పించింది. అర్హులైన వారు తిరిగి విధుల్లో చేరే అవకాశం కల్పిస్తూ ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. దీంతో గతంలో రిటైర్ అయిన పలువురు ఉద్యోగులు మళ్లీ సేవల్లో చేరనున్నారు. అయితే తిరిగి ఉద్యోగంలో చేరే వరకు ఉన్న గ్యాప్ పీరియడ్‌కు ఎలాంటి జీతభత్యాలు చెల్లించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కోర్టు ఉత్తర్వుల ఆధారంగా ప్రస్తుతం సేవలు కొనసాగిస్తున్న ఉద్యోగులకు పూర్తి స్థాయి సర్వీస్ బెనిఫిట్స్ వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. అలాగే నోషనల్ ప్రాతిపదికన వార్షిక ఇంక్రిమెంట్లు కూడా మంజూరు చేయనుంది. ఇక సీనియారిటీ, ప్రమోషన్ల విషయంలో కూడా ఉద్యోగులకు అనుకూల నిర్ణయం తీసుకుంది. ఉద్యోగంలో లేని కాలాన్ని (Out of Employment Period) సీనియారిటీ, పదోన్నతుల లెక్కల్లో పరిగణనలోకి తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇకపోతే ఇప్పటికే పదవీ విరమణ చేసి పెన్షన్ పొందుతున్న ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు వర్తింపజేయనున్నారు. తిరిగి ఉద్యోగంలో చేరాలనుకోని వారు 60 ఏళ్ల వయస్సులోనే రిటైర్ అయినట్లుగా కొనసాగేందుకు కూడా అవకాశం కల్పించారు. ఈ నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలకు వెంటనే పంపించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఉద్యోగుల సంఘాలు చాలా కాలంగా చేస్తున్న డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.