AP Government Schools:ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల హాజరు శాతం, అభ్యసన ఫలితాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. విద్యారంగంలో చేపట్టిన సంస్కరణల ఫలితంగా ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు 1.06 లక్షల మంది విద్యార్థులు కొత్తగా చేరినట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 7,620 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా, వాటిలో 3,515 పాఠశాలలు (46.13 శాతం) గరిష్ట సామర్థ్యానికి చేరుకున్నాయని అధికారులు వివరించారు. విద్యా ప్రమాణాల మెరుగుదలతో పాటు ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల విశ్వాసం పెరగడం వల్లే ఈ మార్పు సాధ్యమైందని పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది 159 పాఠశాలలు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా రూపాంతరం చెందాయని తెలిపారు.
సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణ అంశంపైనా చర్చ జరిగింది. ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేసి, రాష్ట్రానికి అనువైన విధానాన్ని రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో విద్యలో సాంకేతికత వినియోగాన్ని విస్తరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. సెప్టెంబర్ 5 నుంచి తొలి దశలో 175 లీప్ పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు గణితం, సైన్స్ అంశాల్లో ఏఐ ట్యూటర్ను ప్రీ-పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో క్లిక్కర్స్ వ్యవస్థతో ఏఐ ట్యూటర్ను అనుసంధానించాలని లోకేష్ సూచించారు.
అదేవిధంగా ఐఈఆర్పీఎస్ రెగ్యులరైజేషన్, హైస్కూల్ ప్లస్లలో గెస్ట్ లెక్చరర్ల నియామకంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. మరోవైపు అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, విశాఖపట్నంలో జిల్లా కేంద్ర గ్రంథాలయం, మంగళగిరిలో స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్ నిర్మాణ ప్రతిపాదనలను మంత్రి పరిశీలించారు. వచ్చే నెలలో అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

