Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

Sai Krishna

Sai Krishna

Sai Krishna Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కేసులో ఏపీ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిజానిజాలను నిష్పక్షపాతంగా, వేగంగా వెలుగులోకి తీసుకురావడానికి వీలుగా ప్రభుత్వం ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, ఐజీ రవి ప్రకాష్‌ను ఈ ప్రత్యేక ‘సిట్’ (SIT) చీఫ్‌గా ప్రభుత్వం నియమించింది. ఆయన సారథ్యంలో ఈ కేసు దర్యాప్తు సాగనుంది. ఐజీ రవి ప్రకాష్‌తో పాటు పోలీస్ శాఖలో సమర్థులైన మరో ముగ్గురు ఉన్నతాధికారులను సైతం ఈ బృందంలో సభ్యులుగా నియమించారు. ఈ నలుగురు సభ్యులతో కూడిన అత్యున్నత స్థాయి ప్రత్యేక బృందం సాయి కృష్ణ కేసుపై తక్షణమే రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపనుంది. కేసులోని అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించి, నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ కేసు విచారణ మరింత వేగవంతం కానుంది.

సిట్ (SIT) లోని సభ్యుల వివరాలు:
ఐజీ రవి ప్రకాష్ – సిట్ చీఫ్ (SIT Chief)
అద్నాన్ నయీం అస్మీ – పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ (SP)
అమిత్ బార్డర్ – అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ (SP)
ఎల్. సుధాకర్ – బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (Additional SP)

×
×
Ad

మరోవైపు.. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది.. ఈ కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ఏసీపీ దైవప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఉదయం నుంచి విస్తృతంగా విచారణ కొనసాగిస్తోంది. కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తూ కీలక ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. దర్యాప్తులో భాగంగా నందిగామ ఏసీపీ చలసాని శ్రీనివాసరావును విచారణ అధికారి ఏసీపీ దైవప్రసాద్ పిలిపించి వివరాలు సేకరించారు. నందిగామలో జరిగిన నవీన్‌రెడ్డి హత్య కేసు, సాయికృష్ణ అదృశ్యం మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగుతోంది. సాయికృష్ణ కేసు ప్రస్తుతం మే 23, 24 తేదీల చుట్టూనే తిరుగుతోంది. మే 23 రాత్రి విజయవాడ బస్టాండ్ డిపార్చర్ బ్లాక్ వద్ద గుర్తుతెలియని మృతదేహం లభించిన ఘటనను పోలీసులు కీలకంగా పరిగణిస్తున్నారు. అదే మృతదేహాన్ని రాత్రి 8 గంటల సమయంలో స్వర్గపురి స్మశానవాటికకు తరలించిన అంశంపై కూడా లోతుగా విచారణ చేస్తున్నారు. అయితే, గుర్తుతెలియని మృతదేహం గురించి కృష్ణలంక పోలీసులు మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ డిపో అధికారికి పంపిన అధికారిక లేఖ, దానిపై హెడ్ కానిస్టేబుల్ చెన్నారావు ఇచ్చిన ధృవీకరణ పత్రాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ పత్రాల్లోని వివరాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.