NTV Telugu Site icon

YSR Law Nestham: రేపు వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్‌

Jagan

Jagan

YSR Law Nestham: రేపు వైఎస్సార్ లా నేస్తం నిధులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి విడుదల చేయనున్నారు. అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లో నగదును సీఎం జగన్‌ జమ చేయనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొననున్నారు. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా 3 ఏళ్ల పాటు ఏడాదికి రూ. 60,000 చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తున్నారు. మూడేళ్లకు ప్రతి న్యాయవాదికి మొత్తం రూ. 1,80,000 స్టైఫండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది.

2023-24 సంవత్సరానికి రెండో విడత సహాయం రేపు ముఖ్యమంత్రి జగన్‌ న్యాయవాదుల ఖాతాల్లో జమచేయనున్నారు. నెలకు రూ.5 వేల రూపాయల స్టైఫండ్ రూపంలో ప్రభుత్వం అందిస్తోంది. జులై – డిసెంబర్ మధ్య కాలానికి… గత 6 నెలలకు ఒక్కొక్కరికి 30,000 రూపాయల ఆర్ధిక సహాయం అందించనున్నారు. 2,807 మంది జూనియర్ న్యాయవాదులకు సహాయం అందనుంది. లబ్దిదారుల ఖాతాల్లో సుమారుగా 8 కోట్ల రూపాయలను ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్. ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం అందించిన మొత్తం 49. 51 కోట్లు.

Read Also: Rajahmundry: ప్రధాన రహదారిలో ఒక్కసారిగా కుంగిపోయిన భూమి.. భయాందోళనకు గురైన స్థానికులు

న్యాయవాదుల సంక్షేమం కోసం ఏపీ అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా రూ. 100 కోట్లతో “అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్” ను ఏర్పాటు చేసి, న్యాయవాదులు అవసరాలకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, ఇతర అవసరాలకోసం ట్రస్ట్ ద్వారా ఇప్పటికే రూ. 25 కోట్ల ఆర్థిక సాయం అందించారు. ఆర్థిక సాయం కోరే అడ్వకేట్స్ ఆన్ లైన్‌లో mailto:sec_law@ap.gov.in ద్వారా లేదా నేరుగా లా సెక్రటరీకి అప్లై చేసుకోవాలి. “వైఎస్సార్ లా నేస్తం” పథకానికి సంబంధించి ఏ రకమైన ఇబ్బందులున్నా 1902 ను సంప్రదించాలని అధికారులు సూచించారు.