NTV Telugu Site icon

AP CM Jagan: మహిళా,శిశు సంక్షేమశాఖపై సీఎం సమీక్ష.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ అందించిన జగన్

Ap Cm Jagan

Ap Cm Jagan

AP CM Jagan: మహిళా,శిశు సంక్షేమశాఖపై సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఫౌండేషన్‌ స్కూల్‌లో చిన్నారులకు బోధనపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ప్రత్యామ్నాయ బోధనా విధానాలపై పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంగ్లీషు భాషలో పరిజ్ఞానం, ఉచ్ఛారణ బాగుండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గర్బిణీలు, బాలింతలకు ఇచ్చే వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ – టేక్‌ హోం రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా గర్భిణీలు, బాలింతలు డ్రైరేషన్‌ అందుకున్నారు. గతంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల పౌష్టికాహారం కోసం గత ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.450 నుంచి రూ.500 కోట్లు ఖర్చు చేస్తే.. వైయస్సార్సీపీ ప్రభుత్వం పౌష్టికాహారం కోసం ప్రతిఏటా చేస్తున్న ఖర్చు సుమారుగా రూ.2300 కోట్లు అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

వైయస్సార్‌ సంపూర్ణ పోషణ్‌ కింద నెలకు అందే రేషన్‌ సరుకులు:
2 కేజీల రాగి పిండి.
1 కేజీ అటుకులు.
250 గ్రాముల బెల్లం.
250 గ్రాముల చిక్కీ.
250 గ్రాముల ఎండు ఖర్జూరం.
3 కేజీల బియ్యం.
1 కేజీ పప్పు.
అర లీటరు వంటనూనె.
25 గుడ్లు.
5 లీటర్ల పాలు.

వైయస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ కింద అందే రేషన్‌ సరుకులు:
1 కేజీ రాగి పిండి.
2 కేజీల మల్టీగ్రెయిన్‌ఆటా.
500 గ్రాముల బెల్లం.
500 గ్రాముల చిక్కీ.
500 గ్రాముల ఎండు ఖర్జూరం.
3 కేజీల బియ్యం.
1 కేజీ పప్పు.
అర లీటరు వంటనూనె.
25 గుడ్లు.
5 లీటర్ల పాలు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన భవిష్యత్‌ తరాలకోసం సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్‌ కార్యక్రమాలను మరింత బలోపేతం చేశామన్నారు. నిధులకు వెనుకాడకుండా.. ఏరాష్ట్రంలో లేని విధంగా ఖర్చుచేసి గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. డ్రై రేషన్‌ కింద అందించే సరుకుల నాణ్యతపై నిరంతరం సమీక్ష చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించాలన్నారు. గతంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల పౌష్టికాహారం కోసం గత ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.450 నుంచి రూ.500 కోట్లు ఖర్చు చేస్తే.. వైయస్సార్సీపీ ప్రభుత్వం పౌష్టికాహారం కోసం ప్రతిఏటా చేస్తున్న ఖర్చు సుమారుగా రూ.2300 కోట్లు చేస్తోందన్నారు. రక్తహీనత, పౌష్టికాహారలేమి లాంటి సమస్యలు పూర్తిగా రాష్ట్రంలో తొలగిపోవాలన్న లక్ష్యంతో ఇంత ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ మంచి ఫలితాలు ఇవ్వాలన్నారు. దీనికోసం అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ గ్రామాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా అంగన్‌వాడీలను సందర్శించాలన్నారు. అక్కడ పిల్లలు, తల్లులు, బాలింతల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించాలని సీఎం సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే వారికి మంచి వైద్యాన్ని అందించాలన్నారు.

బాల్యవివాహాల నిరోధం, అక్షరాస్యత పెంపు, చదువుల్లో బాలికలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మ ఒడి, కళ్యాణమస్తు, వసతిదీవెన, విద్యా దీవెన ఏరకంగా ఉపయోగపడతాయన్న దానిపై బాగా అవగాహన కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీతోఫా కూడా ఏ రకంగా బాల్యవివాహాలను నిరోధిస్తుందో కూడా వారికి వివరించాలన్నారు. కళ్యాణమస్తు కింద లబ్ధి పొందాలంటే వధూవరులు తప్పనిసరిగా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలన్న నిబంధనను అందుకే పెట్టామన్నారు. రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలపై ముమ్మర ప్రచారం నిర్వహించాలన్నారు. అంగన్‌ వాడీ కేంద్రాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడాలి. దీనికోసం క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో టాయిలెట్ల పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు నిర్వహించే మరమ్మతుల్లో ముందుగా టాయిలెట్ల మరమ్మతును ప్రాధాన్యతగా తీసుకోవాలని సీఎం సూచించారు.

ఫౌండేషన్‌ స్కూలు పిల్లలకు విద్యాబోధనలో నాణ్యతకు పెద్దపీట వేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఇప్పుడున్న విద్యావిధానం కాక ఇతర విద్యావిధానాలను కూడా పరిశీలించాలన్నారు. ఫౌండేషన్‌ స్కూల్లో (పీపీ–1, పీపీ–2) పిల్లల్లో ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం, ఫొనిటిక్స్, ఉచ్ఛారణ లాంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని కోరారు. ఇప్పుడు మనం నిర్దేశించుకున్న సిలబస్‌ను వినూత్న బోధనా పద్ధతులతో నేర్పించే అంశాలపై దృష్టిపెట్టాలన్నారు. మూడో తరగతి నుంచి టోఫెల్‌ శిక్షణ ఇచ్చే కార్యక్రమం మొదలయ్యిందన్నారు సీఎం జగన్. ఇప్పుడు పీపీ–1 నుంచి రెండో తరగతి పిల్లలమీద దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల మెదడు బాగా వృద్ధిచెందే వయసు కాబట్టి, వినూత్న బోధనా పద్దతుల ద్వారా వారికి మంచి భాషా జ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వయసులో పునాదిగట్టిగా పడితే.. ఇక పై తరగతుల్లో విద్యార్ధుల ప్రయాణం సాఫీగా ఉంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దీంట్లో భాగంగా మాంటిస్సోరి విద్యావిధానంపై సమావేశంలో సీఎం చర్చించారు.