Davos Tour: దావోస్‌లో రెండోరోజు సీఎం చంద్రబాబు పర్యటన.. 15కు పైగా సమావేశాలతో బిజీబిజీ!

  • దావోస్‌లో రెండోరోజు సీఎం పర్యటన
  • 15కు పైగా సమావేశాలతో బాబు బిజీబిజీ
  • పెట్టుబడులపై చంద్రబాబు చర్చ
Cm Chandrababu

Cm Chandrababu

దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్ (డబ్ల్యూఇఎఫ్‌) వార్షిక సదస్సు 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు వివిధ దేశాల నాయకులు, అధికారులు, వ్యాపార వేత్తలు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. దావోస్‌లో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.

రెండో రోజూ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో సీఎం చంద్రబాబు నాయుడు వరుస సమావేశాలు కానున్నారు. 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి భేటీలు కానున్నారు. గ్రీన్ హైడ్రోజన్ – గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకానమీ సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరుకానున్నారు. సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, యూఏఈ ఎకానమీ మినిస్టర్‌తోనూ సీఎం ఈరోజు భేటీ కానున్నారు. వెల్స్‌పన్ చైర్మన్ బీకే గోయింకా, ఎల్జీ కెమ్ సీఈవో షిన్ హక్ చియోల్, కార్ల్స్‌బెర్గ్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌లతో భేటీ కానున్నారు. వాల్‌మార్ట్ ప్రెసిడెంట్-సీఈవో కాత్ మెక్‌లే, సిస్కో సీఈవో చుక్ రాబిన్స్, కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ తదితరులతో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించనున్నారు.