ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ‘జాబ్ ఫస్ట్’ నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన కీలక అంశాలు ఇలా ఉన్నాయి.
ఉద్యోగాల భర్తీ షెడ్యూల్..
మే 15, 2026 నుంచి అక్టోబర్ 15, 2026 మధ్య కాలంలో వరుసగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 21 నెలల కాలంలోనే ప్రభుత్వ , ప్రైవేటు రంగాల్లో కలిపి సుమారు 6 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించినట్లు సీఎం వివరించారు. రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమల స్థాపన ద్వారా ప్రైవేటు రంగంలో ఈ ఏడాది మరిన్ని లక్షల ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
Also Read:Telangana: ఐదుగురిని ప్రభుత్వ విప్లుగా నియమించిన తెలంగాణ ప్రభుత్వం..
ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. అభ్యర్థులు తమ ప్రిపరేషన్ను ముమ్మరం చేసి, ప్రతిభతో ఉద్యోగాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మరోవైపు.. ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టం గురించి చర్చించారు. అధికారులు అందించిన ప్రాథమిక అంచనాలను పరిశీలించిన సీఎం, ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకూడదని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని లెక్కించాలని, త్వరితగతిన నివేదికలు అందజేయాలని అధికారులను సూచించారు. రైతులకు అండగా నిలవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
