AP Cabinet Meeting Today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈరోజు ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధితో పాటు పలు కీలక పరిపాలనా, సంక్షేమ అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో హైకోర్టు భవనాల పరిసరాల్లో రూ.547 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల పరిధిలో అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి సంబంధించి ఆర్ఎఫ్పీ ప్రక్రియకు కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించే అవకాశముంది. సీఆర్డీఏకు సొంతంగా అగ్నిమాపక విభాగం ఏర్పాటు ప్రతిపాదన కూడా కేబినెట్ ముందుకు రానుంది. అమరావతిలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా పీపీపీ విధానంలో డిజైన్-బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ పద్ధతిలో జెయింట్ అబ్జర్వేషన్ వీల్ నిర్మాణానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను పీపీపీ లేదా జాయింట్ వెంచర్ మోడల్లో అభివృద్ధి చేయడంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఎల్పీఎస్ లేఅవుట్లలో వీధిపోట్లు ఉన్న ప్లాట్లలో ఏటీఎంలు, కియోస్క్లు తదితర సౌకర్యాల ఏర్పాటుకు కేబినెట్ సమావేశంలో అనుమతి ఇవ్వనున్నారు. అలాగే కొత్త అలాట్మెంట్ కోడ్లు మారిన కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 495 మంది రైతులకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు కల్పించడంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నెగోషియబుల్ సెటిల్మెంట్ పాలసీ కింద అనువుగా లేని ప్లాట్లకు గ్రామకంఠంలో ఐదు సెంట్ల వరకు భూమి కేటాయింపుపై చర్చ జరగనుంది. రాజధాని ప్రాంతంలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటుకు సంబంధించిన పాత ఒప్పందాన్ని రద్దు చేసి.. కొత్తగా టెండర్లు పిలవడంపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
దిగువ మరియు మధ్యతరగతి వర్గాలకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశం కూడా కేబినెట్ సమావేశంలో ప్రాధాన్యత పొందనుంది. అదేవిధంగా ‘తల్లికి వందనం’ పథకానికి నిధుల విడుదలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించిన ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కేబినెట్ ఎజెండా ముగిసిన అనంతరం రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన, వైఎస్సార్సీపీ చేస్తున్న విమర్శలు, ప్రచారాలపై మంత్రులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
