AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం!

  • సచివాలయంలో ఏపీ కేబినెట్‌ భేటీ
  • పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
  • మున్సిపల్‌ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు అంగీకారం
Ap Cabinet Meeting

Ap Cabinet Meeting

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంద్రప్రదేశ్ సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. 14 అంశాలు ఎజెండాగా క్యాబినెట్ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం అయింది. మున్సిపల్‌, రెవెన్యూ, విద్యుత్‌ శాఖల అంశాలే ప్రధాన అజెండాగా భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో రూ.2,700 కోట్ల రూపాయలు విలువ గల రెండు ఇంజరీనింగ్ పనులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మున్సిపల్‌ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు కేబినెట్ అంగీకారం తెలిపింది.

సీఆర్డీఏ పరిధిలో రూ.2,700 కోట్ల మేర పనులు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ ఏపీ ఎంఆర్యూడీఏ చట్టం 2016లో భవనాల లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రి పడకలను 100కి పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ ఏర్పాటుపై కేబినెట్ మీటింగ్లో చర్చిస్తున్నారు. అలానే చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్‌ బెటాలియన్‌ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై క్యాబినెట్‌లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. నంద్యాల, వైఎస్‌ఆర్‌, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలపనున్నట్లు సమాచారం. సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది.