ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల నిర్వహణలో పలువురు ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. సభ్యులు ప్రశ్నలు అడిగి సభకు డుమ్మా కొట్టడంపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశ్నలు అడిగిన వారు సభకు రాకపోవడం వలన మరో ఇద్దరు మాట్లాడే అవకాశం కోల్పోతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ రిజిస్టర్లలో సంతకాలు ఉంటునాయి కానీ.. సభలో సదరు సభ్యులు కనిపించడం లేదని స్పీకర్ పేర్కొన్నారు. ప్రజల చేత ఎన్నికై దొంగలా రావడం ఏంటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Rajasthan Royals Captain: రాజస్థాన్ రాయల్స్కు భారీ షాక్.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
‘కొంతమంది సభ్యులు సభకు రావడం లేదు. మరి కొందరు సభ్యులు దొంగల్లా వచ్చి రిజిస్టర్లలో సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారు. ప్రజల చేత ఎన్నికై దొంగలా రావడం ఎందుకు. ప్రశ్నలు అడుగుతున్నారు సభలో ఉండడం లేదు. హజరు పట్టికలో సంతకాలు చేసి సభకు రాకపోవడం వారి గౌరవాన్ని పెంచదు. వై బాల నాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధ, అమరనాధ రెడ్డి, విశ్వేశరరాజులు ఇలా సంతకాలు చేసి వెళ్లిపోతున్నారు. గవర్నర్ ప్రసంగం తరువాత వేర్వేరు రోజుల్లో వీరు సంతకాలు చేసి వెళ్లినట్టు తెలుస్తోంది. మీకు ఓట్లేసిన ప్రజలకు ఇలా చేసి తలవంపులు తేవద్దని కోరుతున్నాం’ అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.