AP Aqua Farmers: ఆక్వా రైతులకు గుడ్‌న్యూస్.. విద్యుత్ సబ్సిడీ, ఫీడ్ ధరల తగ్గింపు..! కీలక ప్రకటన

Kinjarapu Atchannaidu

Kinjarapu Atchannaidu

AP Aqua Farmers: ఆక్వా రైతులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా రైతుల ముందే వారికి అవసరమైన జీవో నంబర్ 57ను విడుదల చేశామని చెప్పారు. ఆక్వా జోన్, నాన్‌-ఆక్వా జోన్ అనే తేడా లేకుండా అర్హత ఉన్న ఆక్వా రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ అందుతుందని స్పష్టం చేశారు. 2024 ఎన్నికలు కురుక్షేత్ర రణరంగాన్ని తలపించేలా జరిగాయని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఐదేళ్లపాటు పోరాటం చేసి విజయం సాధించిన తర్వాత సంతోషం కంటే భయమే ఎక్కువగా ఉందని చెప్పారు. అప్పటి ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉండటంతో కొద్దిరోజుల్లోనే తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందేమోనని ఆందోళన చెందామని పేర్కొన్నారు.

అప్పులు తప్ప ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేని పరిస్థితుల్లోనూ జీతాలు చెల్లించడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహకారం, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న సహకారంతో రాష్ట్రం క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడుతోందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా 26 నెలల్లో అమలు చేశామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా బ్లూ ఎకానమీపై దృష్టి పెరుగుతోందని, సముద్ర ఉత్పత్తుల ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ముందుగానే గుర్తించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. అమెరికా ఆంక్షలు వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆక్వా రంగం వృద్ధి పడిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. ఆక్వా రంగానికి ప్రభుత్వం అనేక రకాల సహాయాన్ని అందిస్తున్నప్పటికీ రైతులు ఇంకా మరింత సహాయం కోరుతున్నారని చెప్పారు.

ఆక్వా రైతులకు సంబంధించిన సమస్యల్లో ప్రధానంగా ఉన్న ఫీడ్ ధరలపై కూడా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో వారం నుంచి పది రోజుల్లో ఫీడ్ ధరలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ఇకపై ధరల నియంత్రణను అందరి ఆమోదంతో చేపడతామని, ఎవరి ఇష్టానుసారం ధరలు పెంచుకునే అవకాశం ఉండదని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు.. ఆక్వా రైతుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా మంత్రి విమర్శలు చేశారు. ఆక్వా సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని వ్యాఖ్యానించారు. ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పినా, అది పంచాయతీ భవనాల్లోనే నడుస్తోందని విమర్శించారు.

జగన్ వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు విమర్శలు
ఆక్వా ఫీడ్ కంపెనీలు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానిస్తున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అయితే ఈ కంపెనీలు గత ప్రభుత్వాల కాలంలోనే ఏర్పాటయ్యాయని, ఆక్వా రంగం గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని విమర్శించారు. గతంలో ఆక్వా రంగాన్ని నష్టాల్లోకి నెట్టినవారు ఇప్పుడు పరామర్శల పేరుతో వస్తే రైతులు నిలదీయాలని ఆయన అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. 2019లో ప్రజలు ఆవేశానికి లోనై తప్పు నిర్ణయం తీసుకున్నారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు స్వేచ్ఛ లేదని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గతంలో జరిగిన కొన్ని రాజకీయ ఘటనలను ప్రస్తావిస్తూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవరపల్లి పర్యటనలో టీడీపీ కార్యకర్త మృతి ఘటనను కూడా ప్రస్తావించారు. రాజకీయాల్లో హింసకు తావు లేకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు.

ఆక్వా రంగాన్ని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం
ఆక్వా రంగాన్ని అన్ని విధాలుగా బలోపేతం చేసి దేశానికి ఒక రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు విద్యుత్ సబ్సిడీ, ఫీడ్ ధరల నియంత్రణ, మార్కెట్‌లో స్థిరత్వం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని చెప్పారు. ఆక్వా రైతుల సంక్షేమం, రంగం అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతామని మంత్రి పేర్కొన్నారు.