Andhra Paper Mill Fine: రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ మిల్లుపై కాలుష్య నియంత్రణ మండలి కఠిన చర్యలు చేపట్టింది. పర్యావరణ నిబంధనలను పదేపదే ఉల్లంఘించిందని నిర్ధారించిన పీసీబీ.. పేపర్ మిల్లు పరిశ్రమకు రూ.21 కోట్లకు పైగా పర్యావరణ పరిహారం విధించింది. గోదావరిలో వ్యర్థాల విడుదలకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ.. కాలుష్య నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేసింది.
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ మిల్లుకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రూ.21.01 కోట్ల పర్యావరణ పరిహారం క్రింద జరిమానా విధించింది. పర్యావరణ నిబంధనలను పదేపదే ఉల్లంఘించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పీసీబీ వెల్లడించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 26న తూర్పులంక ఇసుక మేటలు, పరిసర ప్రాంతాలను పరిశీలించిన సందర్భంగా గుర్తించిన పర్యావరణ ఉల్లంఘనలపై పీసీబీ మే 28, జూన్ 12 తేదీల్లో ఆంధ్రా పేపర్ మిల్లుకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వ్యర్థాల పారవేతకు ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
సంస్థకు లోపాలు సరిదిద్దుకునేందుకు తగిన సమయం, అవకాశాలు కల్పించినప్పటికీ సెప్టెంబర్ 3న నిర్వహించిన తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలు కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పర్యావరణ పరిహారంగా రూ.21.01 కోట్ల జరిమానా విధించారు. గోదావరి పరిసరాల్లో వ్యర్థాలను విడుదల చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పీసీబీ స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ ఉండదని, భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించింది.

