Gudivada Amarnath: అనకాపల్లి జిల్లాలోని అచ్చుతాపురం మండలం దుప్పుతూరు గ్రామంలో బ్రాండెక్స్ గోడ నిర్మాణ పనులపై స్థానికులు ఆందోళనకు దిగారు. గతంలో ఎస్సీజెడ్ ఏర్పాటు సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గోడ నిర్మాణం చేపట్టడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయకుండా ముందుకు సాగడం అన్యాయమని వారు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. మాజీ ఎమ్మెల్యేలు కరుణం ధర్మశ్రీ సహా పలువురు నేతలు మద్దతు ప్రకటించారు.. గ్రామానికి చేరుకుని బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. పరిశ్రమలు రావడం అవసరమే అయినప్పటికీ, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా చర్యలు తీసుకోవడం సరికాదని అన్నారు. 750 కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదని, గ్రామాన్ని తరలించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేశారు. ప్రజలు తమ హక్కుల కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. అలాగే మహిళలపై లాఠీచార్జ్ జరగడం దురదృష్టకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఇంతకుముందు ఇలాంటి ఘటనలు జరగలేదని పేర్కొన్నారు. గ్రామస్తుల డిమాండ్లు న్యాయమైనవని, ముందుగా పరిహారం ఇచ్చి తరువాతే గోడ నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు పనులు కొనసాగించడానికి వీల్లేదని హెచ్చరించిన ఆయన, అవసరమైతే న్యాయపరంగా పోరాటం చేస్తామని తెలిపారు. అలాగే వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామస్తులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మొత్తంగా, దుప్పుతూరు గ్రామంలో ఈ అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతుండగా, రాజకీయ నాయకుల మద్దతుతో ఈ సమస్య మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
