CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..

Chandrababu Ugadi Speech

Chandrababu Ugadi Speech

అనకాపల్లి కేవలం బెల్లానికి మాత్రమే పరిమితం కాదని, రాబోయే రోజుల్లో దేశంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్ హబ్‌గా ఆవిర్భవిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తాము చేస్తున్న అభివృద్ధిని ప్రజలు అభిమానిస్తే అదే తమకు అసలైన తృప్తినిస్తుందని పేర్కొన్నారు. సమాజానికి మంచి చేసే ప్రతి పనిలోనూ సవాళ్లు, విమర్శలు ఎదురవుతాయని.. అయితే అభివృద్ధి ప్రయాణం ఆగదని తేల్చి చెప్పారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తే నీటి ఎద్దడి తలెత్తుతుందంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డేటా సెంటర్ ఇంకా ప్రారంభమే కాకముందే నీళ్లు ఇంకిపోయాయని ప్రచారం చేయడం వారి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు.

ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా త్వరలోనే అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలకు గోదావరి జలాలను తరలిస్తామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ తొలి వారంలోనే ఈ పనులను పూర్తి చేసి చూపిస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా గోదావరి జలాల తరలింపు వేగవంతం చేస్తామని చెప్పారు. అలాగే, అమరావతికి అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటింగ్ సాంకేతికత రావడం రాష్ట్రానికే గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. మంచి పనులను అడ్డుకోవాలని చూసే విమర్శలను పక్కనపెట్టి, పరిశ్రమల స్థాపన , మౌలిక వసతుల కల్పనతో ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.