PM Modi: బెంగాల్‌లో మోడీ టూర్.. ఎప్పుడంటే..?

Pm Modi Tour

Pm Modi Tour

సార్వత్రిక ఎన్నికల ముందు దేశ వ్యాప్తంగా రాష్ట్ర పర్యటనలతో ప్రధాని మోడీ (PM Modi) బిజిబిజీగా గడుపుతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసినప్పటి నుంచి ఆయా రాష్ట్రాల్లో ప్రధాని పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తూ.. మరికొన్నింటికి శంకుస్థాపనలు చేస్తున్నారు.

తాజాగా పశ్చిమబెంగాల్ (West Bengal) పర్యటన ఆసక్తి రేపుతోంది. గత కొద్ది రోజులుగా సందేశ్‌ఖాలీ నిరసనలతో మార్మోగుతోంది. తమపై తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత షాజహాన్‌ షేక్‌, అతడి అనుచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, భూములు ఆక్రమించారని స్థానిక మహిళలు ఆరోపించారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కొనసాగిస్తున్నారు. బాధిత మహిళలకు మద్దతుగా బీజేపీ కూడా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో హింస చెలరేగడంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించారు. మరోవైపు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు.

ఈ అలజడి నేపథ్యంలో ప్రధాని మోడీ బెంగాల్ పర్యటన ఖరారైంది. మార్చి 1, 2 మరియు 6 తేదీల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. మార్చి 1న ఆరంబాగ్‌లో, 2వ తేదీన కృష్ణానగర్‌లో మోడీ పర్యటిస్తారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ (Sukanta Majumdar) తెలిపారు. అలాగే బహిరంగ సభల్లో ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారని పేర్కొన్నారు.

అనంతరం అదే నెల మార్చి 6న కూడా మరోసారి మోడీ పర్యటించనున్నారు. బెంగాల్ నార్త్ 24 పరగణాల జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ సందేశ్‌ఖాలీ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అత్యాచార బాధిత మహిళలతో కూడా మోడీ భేటీకానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మహిళా ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ పర్యటనలు బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య తీవ్ర రాజకీయ దుమారం చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయి. సందేశ్‌ఖాలీలోని (Sandeshkhali) పలువురు మహిళలు షాజహాన్ షేక్, అతని మద్దతుదారులపై భూకబ్జాలు మరియు లైంగిక ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మోడీ పర్యటన చేయడం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే ప్రధాని మోడీని సందేశ్‌ఖాలీ బాధిత మహిళలు కలవాలనుకుంటే అందుకు ఏర్పాట్లు చేస్తామని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తెలిపారు.