Ambati Rayudu declines BRS MLA Padi Kaushik Reddy’s Request: షూటర్ ఇషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్లకు హైదరాబాద్లో ఒక్కొక్కరికి 600 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించడానికి తెలంగాణ కేబినెట్ ఇటీవలే అంగీకరించిన విషయం తెలిసిందే. తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వాగతించారు. అంతేకాదు మాజీ క్రికెటర్లు ప్రజ్ఞాన్ ఓఝా, అంబటి రాయుడు.. బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలకు కూడా హైదరాబాద్లో ఇంటి స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే తెలంగాణ ప్రభుత్వంకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అభ్యర్థనపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించారు. ఎమ్మెల్యే చేసిన అభ్యర్థనపై హర్షం వ్యక్తం చేసిన రాయడు.. తనకు ఎలాంటి ఇంటి స్థలం అక్కర్లేదన్నారు. ‘కౌశిక్ రెడ్డి గారూ.. క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా ముఖ్యం. భారత క్రికెట్కు మొహమ్మద్ సిరాజ్ చేసిన కృషికి గుర్తింపు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడూ ప్రభుత్వంను ఏమీ అడగలేదు, ఆశించలేదు. అన్ని క్రీడలు మరియు క్రీడాకారులకు సమానంగా మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. నైపుణ్యాలను మెరుగుపరచడానికి, అభివృద్ధి చేయడానికి మద్దతు చాలా అవసరం’ అని రాయడు పేర్కొన్నారు.
Also Read: Neeraj Chopra-Visa: నీరజ్ చోప్రా ‘గోల్డ్’ కొడితే.. ప్రపంచంలో ఎక్కడికైనా ఫ్రీగా వెళ్లొచ్చు!
‘క్రికెటర్లుగా మేం ఆర్థికంగా బాగా నిలదొక్కుకోగలం. ఈ విషయంలో మేము అదృష్టవంతులం. నాకు భూమిని కేటాయించమని ప్రభుత్వానికి మీరు చేసిన అభ్యర్థనను నేను గౌరవపూర్వకంగా తిరస్కరిస్తున్నాను. నిజంగా ఆ అవసరం ఉన్న క్రీడాకారులను ఆదుకోవాలని కోరుతున్నా’ అని అంబటి రాయుడు ట్వీట్ చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేశారు. రాయుడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.