Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: తనపై అనేక కేసులు నమోదయ్యాయని, అవన్నీ ప్రస్తుతం ఎఫ్‌ఐఆర్‌ దశలోనే ఉన్నాయని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ఛార్జ్‌షీట్లు దాఖలు కాలేదని పేర్కొన్నారు. ఒకే ఘటనకు సంబంధించి అనేక కేసులు నమోదు చేసి తనను వేధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు సీఐడీతో పాటు మరో కేసు నమోదు చేశారని అంబటి రాంబాబు అన్నారు. ఇటీవల పట్టాభిపురం పోలీసులు తనపై నమోదు చేసిన కేసు చాలా విచిత్రంగా ఉందని వ్యాఖ్యానించారు. తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు తనకు ఉందని తెలిపారు.

తన అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన పార్టీ అంటూ ఓ పాటను పోస్టు చేశానని అంబటి చెప్పారు. చంద్రబాబు తరచూ వైసీపీని ‘గొడ్డలి పార్టీ’ అంటూ విమర్శిస్తున్నారని, దానికి కౌంటర్‌గా ‘వెన్నుపోటు పార్టీ’ అనే పదాన్ని ఉపయోగిస్తూ పాటను పోస్టు చేశానని వివరించారు. రాజకీయ విమర్శలను పాట రూపంలో చెప్పానని తెలిపారు. జగన్‌పై ఏఐ వీడియోల ద్వారా అత్యంత అవమానకరమైన పోస్టులు పెడుతున్నా వాటిపై తాను ఫిర్యాదు చేశానని, అయితే ఇప్పటివరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ.. రాజకీయ విమర్శలు చేయకూడదా అని ప్రశ్నించారు.

ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై వ్యంగ్యంగా అనేక సినిమాలు తీశారని అంబటి గుర్తుచేశారు. ఎన్టీఆర్‌ను పోలిన వేషధారణ, పాత్రలతో నటుడు కృష్ణ సినిమాలు చేశారని పేర్కొన్నారు. కేసులతో బెదిరించాలని చూస్తే తాను భయపడేవాడిని కాదని స్పష్టం చేశారు. అదే సమయంలో పోలీసుల వ్యవస్థపై కూడా అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసుల కారులో గంజాయి దొరికిన ఘటనను ప్రస్తావిస్తూ.. పోలీసులే గంజాయి సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. సత్తెనపల్లి, చిలకలూరిపేట, రేపల్లె ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని, వాటాల్లో పోలీసు ఉన్నతాధికారులకు కూడా వాటాలు అందుతున్నాయని ఆరోపించారు. అయితే ఇవి తన ఆరోపణలేనని, సంబంధిత అంశాలపై విచారణ జరగాల్సి ఉందని పేర్కొన్నారు.

రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని అంబటి అన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తున్నది టీడీపీ కాదని, ‘వెన్నుపోటు పార్టీ’ అంటూ విమర్శించారు. తన రాజకీయ విమర్శలు ఆగబోవని స్పష్టం చేశారు. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయం ఎందుకని అంబటి ప్రశ్నించారు. రాజకీయ కక్షల కోసం పోలీసులను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను ప్రభుత్వం నాశనం చేస్తోందని విమర్శించారు. టీడీపీ నేతలు పోలీసులపై దాడి చేసినా కేసులు ఉండవని, తాము రాజధాని పర్యటనకు వెళ్లిన సమయంలో టీడీపీ దాడిలో ఓ కానిస్టేబుల్ తలకు గాయమైన ఘటనను కూడా ప్రస్తావించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..