NTV Telugu Site icon

Telangana: తెలంగాణలో అమర రాజా బ్యాటరీస్ భారీ పెట్టుబడి

Amar Raja Group Batteries

Amar Raja Group Batteries

Telangana: తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అమర రాజా సంస్థ ముందుకొచ్చింది. విద్యుత్‌ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీల యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది. పదేళ్లలో రాష్ట్రంలో రూ.9,500 కోట్లు పెట్టుబడి పెట్టండంతోపాటు 4,500 మందికి ఉపాధి కల్పించనున్నట్లు అమరరాజా గ్రూప్‌ ప్రకటించింది. ఈ మేరకు మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లిలో ఈవీ బ్యాటరీల తయారీ యూనిట్‌తో పాటు లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీ నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం- అమర్‌రాజా సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, అమరరాజా సంస్థ ఛైర్మన్, ఎండీ గల్లా జయదేవ్‌, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్, టీఫైబర్‌ ఎండీ, సీఈఓ సుజయ్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

YS Sharmila: కొట్టినా, చంపినా బెదిరేదిలేదు.. పాదయాత్ర కొనసాగింపుపై షర్మిల కీలక నిర్ణయం

రాష్ట్రంలో పెట్టుబడి పెట్టనున్న అమర్‌రాజా సంస్థకు మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు అన్ని వసతులు కల్పిస్తున్నామని వివరించారు. ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడులకు అమరరాజా ముందుకొచ్చిందన్న కేటీఆర్‌.. అమరరాజా కంపెనీకి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రదేశమన్న గల్లా జయదేవ్‌.. నూతన సాంకేతికతతో బ్యాటరీల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే 10 ఏళ్లల్లో తెలంగాణలో రూ.9,500 కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నామని తెలిపారు. తెలంగాణలో మా సంస్థ ఏర్పాటు చేస్తుండడం సంతోషంగా ఉందని జయదేవ్‌ అన్నారు.