నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతలు గతి తప్పాయని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండల కేంద్రంలో ఇటీవల జరిగిన ఓ సంఘటనలో జైలుకు వెళ్లిన యువకులను స్థానిక సబ్ జైల్ లో గురువారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో ఎస్పీ జానకి షర్మిల వచ్చిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. కేవలం హిందువులపై కక్ష పూరితంగా అక్రమంగా కేసులు నమోదు చేస్తూ జైలుకు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన జిల్లా పోలీస్ అధికారి ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. జిల్లా ఎస్పీ తీరుపై కేంద్ర హోం శాఖ మంత్రి, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని మహేశ్వర్ రెడ్డి అన్నారు.