అడివి శేష్ తన విజయ పరంపరను కొనసాగిస్తూ ‘డెకాయిట్’ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. శానియల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్లో చిత్ర బృందం ఘనంగా విజయోత్సవ వేడుకను నిర్వహించగా, ఈ వేడుకలో ముఖ్య అతిథిగా దర్శకుడు నాగ్ అశ్విన్, మెగా నిర్మాత అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా మృణాల్ గురించి మాట్లాడుతూ..
Also Read : Raaka: బన్నీ ‘రాకా’లో ఊహించని మలుపు.. అట్లీ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!
‘మృణాల్ ఠాకూర్ అద్భుతమైన నటి. తను ఈ చిత్ర పరిశ్రమకు చాలా అవసరం. తను ఇక్కడే ఒకరిని పెళ్లి చేసుకుని లోకల్ గా స్థిరపడాలని కోరుకుంటున్నా (నవ్వుతూ). గతంలో లావణ్య త్రిపాఠికి కూడా ఇలాగే చెప్పాను, తను వరుణ్ తేజ్ భార్య అయ్యింది’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే శేష్ తన సినిమా హిట్ అయ్యే వరకు రాజీ పడకుండా పని చేస్తాడని కొనియాడారు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ‘నా కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రమిది. ఎప్పుడూ థ్రిల్లర్ సినిమాలు చేసే నేను, మొదటిసారి ఒక నిజాయితీ గల ప్రేమకథను చెప్పాలనుకున్నాను. ప్రేక్షకులు దీన్ని ఆదరించడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ విజయంలో నిర్మాత సుప్రియ గారు, మృణాల్ పాత్ర చాలా ఉంది’ అని అన్నారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘వేసవిలో ఒక మంచి విజయాన్ని అందుకున్న చిత్రమిది. స్మితా పాటిల్, మధుబాల తరహాలో మృణాల్ ఇంకా గొప్ప గొప్ప పాత్రలు చేయాలి అని కోరుకుంటున్నా’ అని అన్నారు.
