Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!

  • అఫ్గానిస్థాన్‌పై తొలి టీ20లో..
  • అభిషేక్ శర్మ 32 బంతుల్లో 82 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్
  • కేవలం 22 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి
  • టీ20 క్రికెట్‌లో 6,000 పరుగుల మైలురాయి పూర్తి..
  • తొలి ఓవర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లలో..
  • రోహిత్ శర్మతో కలిసి అభిషేక్ అగ్రస్థానంలో..
Abhishek Sharma

Abhishek Sharma

Abhishek Sharma Records: అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్‌లో 157 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 13.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మ్యాచ్ లో అభిషేక్ శర్మ 32 బంతుల్లో 82 పరుగులతో భారత విజయాన్ని సులభతరం చేశాడు.

అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. ఈ క్రమంలో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 256.25 స్ట్రైక్‌రేట్‌తో చెలరేగాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 250కుపైగా స్ట్రైక్‌రేట్‌తో 50కిపైగా పరుగులు చేయడం అభిషేక్‌కు ఇది మూడోసారి. దీంతో ఈ ఘనతను అత్యధికసార్లు సాధించిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ రెండు సార్లు ఈ ఫీట్ సాధించాడు. అలాగే ఈ ఇన్నింగ్స్‌లోనే అభిషేక్ శర్మ టీ20 క్రికెట్‌లో 6,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. కేవలం 3,420 బంతుల్లో ఈ ఘనత సాధించి, అత్యంత వేగంగా 6,000 టీ20 పరుగులు చేసిన ఆసియా బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే సిక్సర్ బాదడం అభిషేక్‌కు ప్రత్యేకమైన అలవాటుగా మారింది. అఫ్గాన్‌తో మ్యాచ్‌లోనూ తొలి ఓవర్‌లో సిక్సర్ కొట్టిన అతడు.. భారత్ తరఫున ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మతో కలిసి అగ్రస్థానానికి చేరుకున్నాడు. అభిషేక్ శర్మ ఇప్పటివరకు తొలి ఓవర్‌లో 12 సిక్సర్లు బాదాడు. రోహిత్ శర్మ కూడా 12 సార్లు ఈ ఘనత సాధించాడు. అయితే రోహిత్ ఇందుకోసం 401 బంతులు ఎదుర్కోగా.. అభిషేక్ కేవలం 152 బంతుల్లోనే 12 సిక్సర్లు బాదాడు.

మరోవైపు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ 44 బంతుల్లో 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. మహ్మద్ నబీ 33 పరుగులు చేశాడు. భారత్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీశారు. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు అభిషేక్ శర్మతో పాటు ఇషాన్ కిషన్ కూడా కీలక సహకారం అందించాడు. ఇషాన్ 33 బంతుల్లో 42 పరుగులు చేశాడు. చివర్లో శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ కలిసి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. దీంతో భారత్ 38 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.