బాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ విడిపోతున్నారంటూ గత కొన్నాళ్లుగా రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ తన వైవాహిక బంధం గురించి ఎంతో హుందాగా మాట్లాడి, ఆ వార్తలకు పరోక్షంగా ముగింపు పలికారు. తమ మధ్య ఎలాంటి ‘ఈగో’ సమస్యలు లేవని, ఒకరినొకరు గౌరవించుకోవడమే తమ విజయ రహస్యమని ఆయన స్పష్టం చేశారు.
తన భార్య ఐశ్వర్యరాయ్ కెరీర్ గురించి అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ‘నా భార్య తన పనిని వదులుకుంటేనే నేను సురక్షితంగా (Secure) ఫీల్ అవుతాను అనుకునే వ్యక్తిని కాదు. అలాంటి అభద్రతాభావం (Insecurity) మా మధ్య లేదు. నా తండ్రి అమితాబ్ బచ్చన్ కంటే నా తల్లి జయా బచ్చన్ పెద్ద స్టార్ అయిన సమయంలోనే వారు పెళ్లి చేసుకున్నారు. ఆ వారసత్వాన్ని నేను చూశాను. ఐశ్వర్య సాధించే విజయాలు నాకు గర్వకారణమే తప్ప, అవి మా మధ్య ఈగో సమస్యలను తీసుకురావు’ అని అభిషేక్ కుండబద్దలు కొట్టారు.
తమ కుమార్తె ఆరాధ్య గురించి చెబుతూ.. ‘పిల్లలకు నీతులు చెప్పడం కంటే మన ప్రవర్తన ద్వారా ఆదర్శంగా నిలవడమే నిజమైన పెంపకం. తండ్రులు అంత మంచి టీచర్స్ కాలేరు కానీ, సరైన విలువలను బిడ్డకు అందించడంలో ఐశ్వర్య, నేను ఎప్పుడూ ఒకే మాటపై ఉంటాం’ అని పేర్కొన్నారు. సుమారు రెండు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్న ఈ జంట మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ వ్యాఖ్యలు మరోసారి చాటిచెప్పాయి. ఏప్రిల్ 20, 2007న వివాహం చేసుకున్న ఈ జంటపై వస్తున్న పుకార్లు కేవలం ఊహాగానాలేనని అభిషేక్ మాటలతో స్పష్టమవుతోంది.