సినీ ఇండస్ట్రీలో నిరంతరం శ్రమిస్తూ, తెర వెనుక ఉండి తెరపై మెరుపులు మెరిపించే గ్రూప్ డ్యాన్సర్లకు అండగా ప్రముఖ కొరియోగ్రాఫర్, ‘ఆట’ ఫేమ్ సందీప్ మాస్టర్ కీలక ప్రకటన చేశారు. తన కొరియోగ్రఫీలో తెరకెక్కే పాటలకు పనిచేసే డ్యాన్సర్ల నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబోనని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ & టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)తో పాటు చెన్నై యూనియన్ సభ్యులకు ఆయన అధికారిక ప్రకటన ద్వారా తన నిర్ణయాన్ని తెలియజేశారు. సాధారణంగా యూనియన్ నిబంధనలు, సాంప్రదాయాల ప్రకారం మాస్టర్లు డ్యాన్సర్ల అసైన్మెంట్ల నుంచి కొంతమేర కమిషన్ పొందే హక్కు ఉంటుంది. అయితే, తన వ్యక్తిగత నిర్ణయం మేరకు తాను ఏనాడూ ఆ కమిషన్ను ఆశించలేదని, భవిష్యత్తులో కూడా తీసుకోబోనని సందీప్ తెలిపారు.
తాను కూడా అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి వచ్చిన డ్యాన్సర్నేనని గుర్తుచేసుకున్న సందీప్, “ఒక డ్యాన్సర్ కెరీర్ నిర్మించుకోవడానికి ఎంతగా చెమటోడ్చాలో, ఎలాంటి కష్టనష్టాలు ఎదుర్కోవాలో నాకు స్వయంగా తెలుసు. వారి అంకితభావం, ప్యాషన్, నిరంతర శ్రమ ఎంతో గొప్పవి. అందుకే వారి కష్టార్జితాన్ని పూర్తిగా గౌరవించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇది కేవలం తెలుగు ఇండస్ట్రీకే పరిమితం కాదు, చెన్నై యూనియన్లో పనిచేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ కమిషన్ తీసుకోలేదు. నా రాబోయే ప్రాజెక్టులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది” అని సందీప్ పేర్కొన్నారు. తన తాజా ప్రాజెక్టులు ‘యేషానాగుల’, సాంగ్ కి తోడ్పాటు అందించిన అసోసియేషన్ పెద్దలకు, డ్యాన్సర్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తోటి కళాకారుల శ్రమను గుర్తించి, వారికి పూర్తి పారితోషికం దక్కేలా సందీప్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయంపై డ్యాన్స్ వర్గాల నుంచి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

