Mangapatnam Train Accident: దేశంలోనే తొలి రైలు ప్రమాదం.. 71 మంది మృతి.. కడపలో 124 ఏళ్ల నాటి విషాదం

1902 Mangapatnam Railway Accident

1902 Mangapatnam Railway Accident

1902 Mangapatnam Train Accident: అవి దేశాన్ని బ్రిటీషర్లు పరిపాలిస్తున్న రోజులు. తేదీ 1902 సెప్టెంబర్ 12. అప్పటి మద్రాసు నుంచి బాంబే (ముంబయి) వైపు ప్రయాణికులతో బయలుదేరిన ‘మెయిల్ రైలు’ ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కడప జిల్లా ముద్దనూరు మండలం మంగపట్నం రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆ సమయంలో కురిసిన భారీ వర్షాల వల్ల మంగపట్నం సమీపంలో ఉన్న రైల్వే వంతెన ఉద్ధృతంగా ప్రవహించిన వరద నీటిలో కొట్టుకుపోయింది. వంతెన కూలిపోయిన విషయం తెలియకపోవడంతో అదే దారిలో వేగంగా వచ్చిన ఆ రైలు పట్టాలు తప్పి ఘోర ప్రమాదానికి గురైంది. దేశ చరిత్రలోనే మొట్టమొదటి రైలు ప్రమాదంగా నిలిచిన ఈ దుర్ఘటనలో 10 మంది యూరోపియన్లు, 61 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. నేటితో ఆ రైలు ప్రమాదానికి 124 ఏళ్లు పూర్తయ్యాయి.

ప్రమాదంలో చనిపోయిన వారి అంత్యక్రియలను ఆ ఘటనా స్థలంలోనే నిర్వహించి, వారందరి జ్ఞాపకార్థం ఒక స్మారక స్తూపాన్ని నిర్మించారు. అయితే చాలామందికి దేశంలోనే తొలి రైలు ప్రమాదం జరిగింది కడప జిల్లాలోనే అనే విషయం తెలియదు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో బెంగళూరులోని కార్మెలైట్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ థెరెసా (సీఎస్‌ఎస్‌టీ) సంస్థ అధిపతి, ఆంగ్లో-ఇండియన్ అయిన మదర్ థెరెసా సెయింట్ రోజ్ ఆఫ్ లీమా ఒకరు. దేశంలో వందకు పైగా పాఠశాలలు, అనాథ ఆశ్రమాలు, ఆరోగ్య కేంద్రాలు, సామాజిక కేంద్రాలను నడుపుతూ ఎనలేని సేవలు అందిస్తున్న ఈ సంస్థను ఆమె నడిపించారు. ఆమె చేసిన సేవలకు గుర్తుగా 2003లో మంగపట్నం వద్ద ఒక ఆంగ్ల మాధ్యమ పాఠశాలను, వైద్యశాలను కూడా స్థాపించారు. నాటి నుంచి నేటి వరకు చాలా తక్కువ ఫీజుతో అనేక మంది విద్యార్థులకు ఈ స్కూల్ ద్వారా మంచి విద్యను అందిస్తున్నారు. అంతేకాకుండా, థెరెసా లీమా సేవలను గౌరవిస్తూ 2021లో కేంద్ర పోస్టల్ శాఖ ఆమె జ్ఞాపకార్థం ఒక ప్రత్యేక పోస్టల్ కవర్‌ను కూడా విడుదల చేసింది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ తొలి రైలు ప్రమాద స్మారక స్తూపం గండికోట జలాశయం వెనుక జలాల్లో ముంపునకు గురైంది. ప్రస్తుతం ఆ నీటి ఉద్ధృతి తగ్గడంతో స్తూపం జల దిగ్బంధం నుంచి బయటపడింది. గండికోట జలాల్లో మునిగి తేలిన ఈ ప్రమాద మృతుల స్తూపాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసి, ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 120 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఘోర ప్రమాదం, నాటి మృతుల స్మారక చిహ్నం నేటికీ మన దేశ రైల్వే గతాన్ని గుర్తుచేస్తూనే ఉన్నాయి.