NTV Telugu Site icon

Reactor Explosion: మాటలకందని విషాదం.. ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో 16 మంది మృతి

Fire Accident

Fire Accident

Reactor Explosion: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో ఇప్పటివరకు 16 మంది మృతి చెందినట్లు తెలిసింది.  మరో 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. రియాక్టర్‌ పేలుడు ధాటికి పరిశ్రమ భవనం దెబ్బతింది.

Read Also: Hezbollah-Israel war: ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా 50 రాకెట్ల ప్రయోగం.. ఒకరి మృతి.. ఇళ్లు ధ్వంసం

శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉంటారని భావించి.. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో 3 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల తొలగింపు కోసం భారీ క్రేన్లను అధికారులు తెప్పించారు. కొన్ని గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అంబులెన్సుల్లో మృతదేహాలు, బాధితులను తరలిస్తున్నారు. శిథిలాల తొలగింపు పూర్తయితే కానీ మృతులు, క్షతగాత్రుల సంఖ్య తేల్చ లేని పరిస్థితిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. కుప్పకూలిన పరిశ్రమ శిథిలాల కింద కార్మికులు నుజ్జునుజ్జయ్యారు. 33మంది ప్రభావానికి గురయ్యారని అధికారులు ప్రకటించారు.ఎసెన్షియా ఫార్మా కంపెనీలో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పని చేస్తున్నారు. భోజన విరామ సమయంలో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకొని ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. భారీ శబ్ధంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మొత్తం 12 అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను అదుపుచేశాయి.

అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలుడు ఘటనపై కలెక్టర్‌తో మాట్లాడారు. తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అచ్యుతాపురం సెజ్‌ ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంపై ఆరా తీశారు. బాధితులకు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

ప్రాణాలు కాపాడడంపై దృష్టి పెట్టాలి.. సీఎం టెలీ కాన్ఫరెన్స్ 

అచ్యుతాపురం ప్రమాదం పై జిల్లా అధికారులు, పరిశ్రమల శాఖ, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.  క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై వివరాలు తెలుసుకున్నారు. అన్ని విభాగాల వైద్యులను అందుబాటులో ఉంచి బాధితుల ప్రాణాలు కాపాడాలని సూచించారు. ఇప్పటి వరకు 17 మంది చనిపోయారని  అధికారులు వివరించారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ప్రమాదానికి కారణాలు ఏంటనే విషయంలో ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు  అధికారులు వివరించారు. ప్లాంట్ నిర్వహణలో మానవ తప్పిదం, ప్లాంట్ నిర్మాణంలో లోపాలపై ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు వెల్లడించారు. ప్రమాదం అనంతరం ఫార్మా కంపెనీ యాజమాన్యం స్పందన సరిగా లేదని స్పష్టం చేశారు. ముందు బాధితుల ప్రాణాలు కాపాడడంపై దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు.  ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలన్నారు. ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

ఫార్మా ప్రమాదంలో మృతుల వివరాలు
10 మంది వివరాలను గుర్తించారు. మృతుల్లో సన్యాసినాయుడు(ప్లాంట్ ఏజీఎం), రామిరెడ్డి(ల్యాబ్ హెడ్), హారిక (కెమిస్ట్), పార్థసారథి (ప్రొడక్షన్ ఆపరేటర్), వై.చిన్నారావు(ప్లాంట్ హెల్పర్), మోహన్ (ఆపరేటర్), గణేశ్ (ఆపరేటర్), హెచ్. ప్రశాంత్, ఎం.నారాయణ, పి. రాజశేఖర్ ఉన్నారు