Sutlej: దిల్జిత్ దోసాంజ్ నటించిన వివాదాస్పద చిత్రం ‘‘సట్లజ్’’పై వివాదం పెద్దదవుతోంది. 1980-90ల ప్రారంభంలో పంజాబ్తో తీవ్రవాదం సమయంలో, చట్టానికి అతీతంగా పోలీసులు ప్రవర్తించడంపై పోరాడిన కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ZEE5 OTTలో విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ సినిమాను తొలగించారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన వివాదం మరింత ముదురుతోంది. సెన్సార్ బోర్డ్ (CBFC) సర్టిఫికేట్ లేకుండానే ఈ చిత్రాన్ని ప్రసారం చేసినందుకు ZEE5పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం.
సమాచారం ప్రకారం.. సెన్సార్ ధ్రువీకరణ లేకుండా సినిమా ప్రసారం చేయడం చట్టపరమైన అంశంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని సట్లజ్ మూవీని ZEE5 నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించగా, ప్లాట్ఫామ్ ఆ చిత్రాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. సెన్సార్ చేయని సినిమాను ప్రసారం చేసినందుకు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫారమ్పై చర్యలు తీసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. ఇదే సమయంలో ఓటీటీలకు సంబంధించి నిబంధనల్ని మార్చడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

