NTV Telugu Site icon

UP BJP: యూపీ బీజేపీలో లుకలుకలు.. ఉప ఎన్నికల ముందు యోగి vs కేశవ్ మౌర్య?

Up Bjp

Up Bjp

UP BJP: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ ప్రదర్శన ఆ పార్టీలో విబేధాలకు కారణమైనట్లు తెలుస్తోంది. గత రెండు పర్యాయాల్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని మెజారిటీ సీట్లను దక్కించుకున్న బీజేపీ, 2024లో మాత్రం దారుణమైన ఫలితాలను చవిచూసింది. ముఖ్యంగా ప్రతిష్టాత్మక రామమందిరం ఉన్న ఫైజాబాద్ స్థానంలో బీజేపీ ఓడిపోవడం ఆ పార్టీని మరింత కుంగదీసింది. మొత్తం 80 ఎంపీ సీట్లు ఉన్న యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి 43 సీట్లను గెలుచుకోగా, బీజేపీ కేవలం 36 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రానున్న 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల కోసం బీజేపీ కార్యచరణ సిద్ధం చేసుకుంటోంది.

ఇటీవల 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా బీజేపీ కేవలం 2 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో యూపీ ఉప ఎన్నికలు బీజేపీకి చాలా కీలకంగా మారాయి. ఇదిలా ఉంటే యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మంగళవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని 10 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలకు ముందు పార్టీ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌తో పాటు బీజేపీ ఉత్తరప్రదేశ్ యూనిట్‌లో కూడా పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, ముఖ్యమంత్రి యోగి మార్పు గురించి ప్రత్యేకం ఎలాంటి చర్చ జరగలేదని తెలుస్తోంది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత మార్పు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోందని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ యూపీ చీఫ్ భూపేంద్ర చౌదరి కూడా నడ్డాలో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో విభేదాల మధ్య కేశవ్ మౌర్య, జెపి నడ్డా మధ్య సమావేశం కూడా జరిగింది.

Read Also: Rythu Runa Mafi: రేపే రైతుల ఖాతాల్లోకి రుణ మాఫీ సొమ్ము.. కార్డు లేకున్నా వర్తింపు..

ఈ 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికల షెడ్యూల్‌ని ఈసీ ఇంకా ప్రకటించకపోయినప్పటికీ, బీజేపీ మాత్రం కార్యాచరణ మొదలుపెట్టింది. మరోవైపు ఈ రోజు ముఖ్యమంత్రి యోగి తన ఇన్‌చార్జ్ మంత్రులతో ఈ రోజు సమావేశమయ్యారు. నిజాయితీగా ఉండి గెలవగల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని, వారి ఇమేజ్ మరియు ప్రజలతో సంబంధానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రులందరూ వారివారి నియోజకవర్గాల్లో స్థానిక విషయాలపై అభిప్రాయాలు తెలుసుకోవాలని, అభ్యర్థుల్ని అంచనా వేయాలని ఆదేశించినట్లు సమాచారం.

గత వారం లక్నోలో జరిగిన బీజేపీ యూపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో కేశవ్ ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. ప్రభుత్వం కన్నా ఆర్గనైజేషన్ ఎప్పుడూ పెద్దది అని వ్యాఖ్యానించారు. అదే సమావేశంలో యోగి ప్రసంగిస్తూ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అంచనాలు, అతి ఆత్మవిశ్వాసం ఓటమికి కారణమని చెప్పారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయిన వారితో సహా పలువురు యుపి బిజెపి నాయకులు ఆదిత్యనాథ్ పని తీరును విమర్శించారు. ఆయన తీరు ఓటమికి కారణమని అన్నారు. బీజేపీ, యూపీ ప్రభుత్వం మధ్య సమన్వయం దెబ్బతినకుండా ఎలాంటి ప్రకటనలు చేయవద్దని నేతలకు నడ్డా సూచించారు.

ఇదిలా ఉంటే, బీజేపీ తీరుపై ప్రతిపక్ష నేత, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విరుచుకుపడ్డారు. గతంలో ఇతర పార్టీలో బీజేపీ చేసిన పని, ప్రస్తుతం ఆ పార్టీలో చెలరేగుతోందని, అంతర్గత విభేదాల గురించి ప్రస్తావించారు. ప్రజల గురించి ప్రభుత్వం ఆలోచించే స్థితిలో లేదని చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నదని అఖిలేష్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం బలహీనంగా మారిందని ట్వీట్ చేశారు.