CM Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దేశ భద్రత, అహింస, ధర్మరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. అహింసా మానవాళికి పరమ ధర్మమని చెబుతూనే, దేశానికి లేదా సమాజానికి ఎవరైనా ముప్పుగా మారితే అలాంటి పరిస్థితుల్లో అహింసతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు. దేశరక్షణ కోసం అవసరమైతే బలప్రయోగం, ధర్మ హింస ముఖ్యమే అని స్పష్టం చేశారు.
లక్నోలో నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అహింసా పరమో ధర్మః.. ధర్మ హింస తథైవ చ’’ అనే సూక్తిని ప్రస్తావిస్తూ.. అహింస అత్యున్నత ధర్మమే అయినప్పటికీ, ధర్మాన్ని, దేశాన్ని కాపాడే సందర్భంలో హింస కూడా ధర్మమే అని ఆయన అన్నారు. దేశం బలంగా ఉంటేనే ప్రపంచం గౌరవిస్తుందని, భద్రతాపరంగా శక్తివంతమైన దేశాలతోనే ఇతర దేశాలు స్నేహం చేయాలని కోరుకుంటాయని ఆయన అన్నారు. బలహీనుల్ని ప్రపంచం ఎప్పుడూ గౌరవించదని చెప్పారు. భారత సాయుధ దళాలు దేశ శత్రువుల్ని ఎదుర్కొనే తీరులో ఈ సూత్రం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు.
అభివృద్ధికి భద్రతే పునాది అని, శాంతి, భద్రతల ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. 2017కు ముందు యూపీలో తరుచూ కర్ఫ్యూలు, మాఫియా ఆధిపత్యం, నేరాలు వల్ల ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారని గుర్తు చేశారు. బీజేపీ పాలనలో రాష్ట్ర శాంతిభద్రతలు మెరుగయ్యాయని చెప్పారు. భారతదేశాన్ని సైనికులు కాపాడుతున్నారని, వారిని గౌరవించడం ప్రజల బాధ్యత అని అన్నారు. దేశ రక్షణలో సైనికుల పాత్ర అపారమని, వారి త్యాగాలను గౌరవించాలని చెప్పారు.
