ప్రస్తుతం రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 2 వరకు సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఇలాంటి తరుణంలో విపక్షం బ్రేక్లు వేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడతారా? లేదా? అన్నది సస్పెన్ష్గా ఉంది.
ఇది కూడా చదవండి: Modi-Trump: మోడీకి ట్రంప్ ఫోన్.. ఏం మాట్లాడారంటే..!
ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడితే నష్టం చేకూరుతుందని విపక్షాలు భావించాయో.. లేదంటే ఇంకేమైనా కారణం ఉందో తెలియదు గానీ.. రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కేంద్రానికి లేఖ రాశారు. సమాజ్వాదీ, ఆర్జేడీ సంతకాలతో కూడిన లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సవివరంగా చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని లేఖలో ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. బిల్లుకు సంబంధించి ప్రభుత్వ ఉద్దేశాలను చర్చించడం చాలా ముఖ్యమని లేఖలో పేర్కొన్నారు. ఖర్గే లేఖపై సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, వామపక్ష పార్టీలు, ఆర్జేడీ సహా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సంతకాలు చేశాయి. మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఈ బిల్లుకు దూరంగా ఉంది.
విపక్షాల లేఖతో ఈ బడ్జెట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టకపోవచ్చని తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేక సమావేశాలు లేదా వర్షాకాల సమావేశాల్లోనైనా ప్రవేశపెట్టే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యాంగ సవరణ అవసరం ఉంటుంది. దీనికి పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం ఉంటుంది.
పార్లమెంట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చని, లేదా వర్షాకాల సమావేశాల్లో దీనిని ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. వాస్తవంగా BAC సమావేశానికి సమర్పించిన నాలుగు బిల్లుల జాబితాలో మహిళా రిజర్వేషన్ బిల్లు లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బడ్జెట్ సమావేశాల తర్వాత కొద్దికాలం విరామం తీసుకుని ఆ తర్వాత వారం రోజుల్లోగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ బిల్లును ఆమోదించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు ఒక సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ విషయంపై మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుల మధ్య కూడా చర్చలు జరిగాయి. ఈ బిల్లు విషయంలో ప్రభుత్వం తొందరపడకూడదని ప్రతిపక్షం భావిస్తోంది. బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మహిళల భాగస్వామ్యాన్ని ఒక ప్రధాన అంశంగా మార్చుకోవడానికి ‘విమెన్ కార్డ్’’ను కేంద్రం ప్రవేశపెడుతోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రతిపక్షం కూడా ఇదే రకమైన ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వాస్తవంగా ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం భావించింది. ప్రతిపాదిత సవరణ ప్రకారం లోక్సభ, విధానసభల్లో మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్యను మూడింట ఒక వంతుకు పెంచాలని ఆలోచన చేసింది. దీంతో లోక్సభలో సభ్యుల సంఖ్య 816కు పెరగవచ్చు. అందులో మొత్తం 273 సీట్లు మహిళా ఎంపీలకు రిజర్వ్ చేయబడతాయి.
ఈ విషయంపై హోం మంత్రి అమిత్ షా పలు ప్రతిపక్ష, ప్రాంతీయ పార్టీల నాయకులతో కూడా సమావేశాలు నిర్వహించారు. వీరిలో ఎన్సీపీ, బీజేడీ, శివసేన (ఉద్ధవ్ వర్గం), వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లును పునఃపరిశీలించడానికి ప్రభుత్వం ఇప్పుడు సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే మార్చి 29న పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. అయితే విపక్షం లేఖతో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
