NTV Telugu Site icon

Maldives Row: మాల్దీవుల వివాదంలో ప్రధాని మోడీకి సెలబ్రెటీల మద్దతు.. లక్షద్వీప్‌లో టూరిజం అభివృద్ధికి పిలుపు..

Maldivis

Maldivis

Maldives Row: ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల లక్షద్వీప్‌ని సందర్శించి అక్కడ పర్యాటకాన్ని ప్రమోట్ చేయడం మాల్దీవులకు అస్సలు నచ్చడం లేదు. పూర్తిగా పర్యాటకంపై ఆధారపడిన ఆ దేశానికి భారత్ నుంచే ఎక్కువ మంది వెళ్తుంటారు. అయితే ఇటీవల ఏర్పడిన మహ్మద్ మయిజ్జూ ప్రభుత్వం చైనా అనుకూల, భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది. తాజాగా ప్రధాని లక్షద్వీప్ వెళ్లడం ఆ దేశానికి మింగుడు పడటం లేదు.

ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ.. ఆ దేశ మంత్రి మరిషం షియునా చేసిన వ్యాఖ్యలపై భారత్ భగ్గుమంటోంది. పర్యాటకంలో మాల్దీవులతో పోటీ పడలేదని, అంతే కాకుండా ప్రధానిని తోలుబొమ్మ అంటూ చేసిన వ్యాఖ్యలపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షద్వీప్ విషయంలో భారత సెలబ్రెటీలు ప్రధానికి మద్దతు నిలుస్తున్నారు. లక్షద్వీప్ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నారు.

Read Also: Maldives: ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనతో మాల్దీవుల్లో ప్రకంపనలు.. భారత్‌పై అక్కసు..

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మాల్దీవుల నేతల వ్యాఖ్యలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘మాల్దీవులకు చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధులు భారతీయులపై ద్వేషపూరిత మరియు జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ వ్యాఖ్యలు చేశారు. తమకు అత్యధిక సంఖ్యలో పర్యాటకులను పంపే దేశానికి వారు ఇలా చేయడం ఆశ్చర్యంగా ఉంది. మన పొరుగువారితో మనం మంచివాళ్లుగా ఉన్నాం, కానీ అలాంటి ద్వేషాన్ని ఎందుకు సహించాలి. ? నేను మాల్దీవులను చాలాసార్లు సందర్శించాను, వాటిని ప్రశంసించాను. కానీ అన్నింటికన్నా ముందు మనకు గౌరవం ముఖ్యమైనది. మనం #ExploreIndianIlands మరియు మన స్వంత పర్యాటకానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుందాం’’ అంటూ ట్వీట్ చేశారు.

మరో నటుడు జాన్ అబ్రహం లక్షద్వీప్ ఆతిథ్యం, పర్యటకాన్ని ప్రశంసించారు. లక్షద్వీప్ వెళ్లాల్సిన ప్రాంతం అని రాశారు. నటి శ్రద్ధా కపూర్.. లక్షద్వీప్ లోని సహజమైన బీచ్‌లు, తీరప్రాంతాలను అన్వేషించాలనే కోరికను వ్యక్తం చేశారు.

లక్షద్వీప్‌లోని అందమైన, పరిశుభ్రమైన బీచ్‌లను స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రశంసించారు. ‘‘లక్షద్వీప్‌లోని అందమైన శుభ్రమైన మరియు అద్భుతమైన బీచ్‌లలో మన గౌరవప్రదమైన ప్రధానమంత్రి నరేంద్రభాయ్ మోడీని చూడటం చాలా బాగుంది, యే హమారే ఇండియా మే హైన్’’ అని రాశారు.