Shah Jahan Daughters: మొఘల్ చక్రవర్తి షాజహాన్ కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకుంటారు. తాజ్ మహల్, ఎర్రకోట, జామా మసీద్ వంటి కట్టడాలు ఈయన కాలంలోనే నిర్మితమయ్యాయి. బయటకు మంచి పాలనా కాలంగా కనిపిస్తున్నప్పటికీ, రాజకుటుంబంలో మాత్రం అనేక కుట్రలు, కుతంత్రాలకు షాజహాన్ కాలం ప్రసిద్ధి చెందింది. తండ్రిపై తిరుగుబాటు చేసి ఔరంగజేబు మొగల్ సింహాసనాన్ని దక్కించుకున్నాడు. అడ్డుగా ఉన్న సోదరుడు దారాషికోను నడి వీధుల్లో తల నరికి చంపాడు. తండ్రి షాహజాన్ను ఒక చిన్న కోటలో బందీగా మార్చాడు.
ఇదిలా ఉంటే, షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలు జహనారా, రోషనారా, గౌహరారాకు వివాహాలు చేయకపోడం కూడా సంచలనమే అని చెప్పొచ్చు. వీరికి వివాహాలు చేస్తే అధికారం, వారసత్వం కోసం పోటీ పెరుగుతుందనే రాజకీయ కారణాలే కారణం కావచ్చని చాలా మంది చరిత్రకారులు చెబుతుంటారు. షాజహాన్ తన అధికారం కోసం పోటీపడే రాజవంశీకుల సంఖ్యను పరిమితం చేయాలనుకున్నాడు . ఈ వ్యూహంలో భాగంగా అతను తన కుమార్తెలను వివాహాలకు దూరంగా ఉంచాడు. మొఘల్ సింహసనానికి కూతుళ్ల సంతానం పోటీగా మారొద్దనే పెళ్లిళ్లు చేయలేదు.
వారసత్వమే ప్రధాన కారణం..
మొఘల్ పాలన బయటకు ఎంత బలంగా కనిపించినా, రాజ కుటుంబంలో మాత్రం ఎప్పుడూ అధికారం కోసం పోరాటం జరుగుతూనే ఉండేది. మొఘల్ రాజుల్లో అక్బర్పై ఆయన కుమారుడు జహంగీర్ తిరుగుబాటు చేశాడు, జహంగీర్పై కూడా షాజహాన్ తిరుగుబాటు చేసిన చరిత్ర ఉంది. నిజానికి మొఘల్ రాజ వంశాల్లో తదుపరి సింహాసనం ఎవరికి దక్కాలనే దానిపై నిర్దిష్ట నియమాలు లేవు. చక్రవర్తి కుమారుల మధ్య వారసత్వ పోరాటాలు సర్వసాధారణం. పెద్ద కుమారుడే చక్రవర్తి అవుతాడని నిర్దేశించే సింహాసనానికి సంబంధించిన స్థిరమైన నియమం ఏదీ లేదు. అందువల్ల, రాజకుటుంబంలో పురుష పోటీదారులు ఎంత ఎక్కువగా ఉంటే, అధికార పోరాటం అంత సంక్లిష్టంగా మారేది. దీంతోనే షాజహాన్ తన వారసుల సంఖ్యను తక్కువ చేసుకునేందుకు కుమార్తెలకు వివాహాలు చేయలేదు.
రాజకీయాలకు దగ్గరగా కుమార్తెలు:
వివాహాలు చేయకున్నా షాజహాన్ తన కుమార్తెలను రాజకీయాలకు దగ్గరగా ఉంచారు. రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనడానికి వారికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు. ఆ సమయంలో, రాజకుటుంబంలో దారా షికో, షుజా, ఔరంగజేబ్ మరియు మురాద్ అనే నలుగురు కుమారులు కూడా ఉన్నారు. ఈ నలుగురు సోదరులు తరువాత మొఘల్ సింహాసనానికి ప్రధాన పోటీదారులుగా మారారు. ఈ అధికార పోరాటంలో షాజహాన్ ముగ్గురు కుమార్తెలు కూడా తమ సోదరులకు మద్దతు ఇచ్చారు.
షాజహాన్ పెద్ద కుమార్తె జహనారా తన సోదరుడైన దారా షికోకు మద్దతు ఇచ్చింది. ఇక తన తదుపరి చక్రవరిగా దారా షికోను చేయాలని షాజహాన్ భావించే వాడు. షాజహాన్కు ముద్దుల కొడుకుగా ఉండే వాడు. మరోవైపు, రోషనారా ఔరంగజేబుకు మద్దతు ఇచ్చింది. మూడవ కుమార్తె గౌహరారా మురాద్ పక్షాన నిలిచింది.

