West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..

  • పశ్చిమ బెంగాల్‌లో 252 మదర్సాల మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు
  • మరో 100 మదర్సాలకు షోకాజ్ నోటీసులు
West Bengal

West Bengal

West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ సర్కార్ మదర్సాలపై ఉక్కుపాదం మోపింది. అనుమతులు, గుర్తింపు లేని 254 మదర్సాలను మూసేయాల్సిందిగా సీఎం సువేందు అధికారి ప్రభుత్వం ఆదేశించింది. మదర్సాల మూసివేతతో పాటు మరో 100 మదర్సాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ఖుదీరామ్ టుడు తెలిపారు. షోకాజ్ నోటీసులు అందుకున్న మదర్సాలు చెల్లుబాటు అయ్యే అనుమతులు, గుర్తింపు, అధికారిక అనుమతి ఉన్నట్లు నిరూపించుకోవాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. సరైన పత్రాలు సమర్పించకపోతే వాటిని కూడా మూసేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

రాష్ట్రంలో గుర్తింపు పొందిన, గుర్తింపు లేని మదర్సాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వేను చేపట్టింది. కోల్‌కతాతో పాటు 22 జిల్లాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. మూసివేసిన 252 మదర్సాల్లో ఎక్కువ భాగం ఖరేజీ మదర్సాలకు చెందినవే అని నివేదికలు చెబుతున్నాయి. మాల్దాలో 44, ఉత్తర దినాజ్‌పూర్‌లో 37, దక్షిణ 24 పరగణాల్లో 32 మదర్సాలు ఉన్నాయి. నదియా, ముర్షిదాబాద్ జిల్లాల్లో చెరో 25 మదర్సాలపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం 2132 మదర్సాలు చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ అనుమతులతో కొనసాగుతున్నట్లు మంత్రి తెలిపారు. 2396 మదర్సాలకు అధికారిక అనుమతులు లేవని ఆయన చెప్పారు. మదర్సాలపై చర్యల్ని బీజేపీ సమర్థించింది. సరిహద్దు ప్రాంతాల్లో ‘‘రాడికలైజేషన్’’ కార్యకలాపాలు పెరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య ఆరోపించారు. బెంగాల్ మంత్రి అగ్నిమిత్ర పాల్ కూడా ఈ చర్యల్ని సమర్థించారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాదులు ఇలాంటి గుర్తింపు లేని మదర్సాల్లో ఆశ్రయం పొందేవారని ఆమె అన్నారు. ఇదిలా ఉంటే, మదర్సాలు కూడా విద్యా వ్యవస్థలో భాగమే అని వాటిని ఉగ్రవాదంతో ముడిపెట్టొద్దని టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ అన్నారు.