West Bengal: పశ్చిమ బెంగాల్లోని ఝార్గ్రామ్ జిల్లాలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ‘ఝల్మురి’ వడ్డించిన స్థానిక దుకాణదారుడు ఇప్పుడు ప్రాణహాని బెదిరింపులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ బెదిరింపులు పాకిస్థాన్, బంగ్లాదేశ్ నంబర్ల నుంచి వస్తున్నాయని బాధితుడు ఆరోపించడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
మోడీ కాన్వాయ్ ఆగిన క్షణంలో మారిపోయిన జీవితం
ఏప్రిల్ 19న ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఝార్గ్రామ్కు వెళ్లారు. ర్యాలీ ముగిసిన అనంతరం ఆయన కాన్వాయ్ తిరుగు ప్రయాణంలో ఉండగా, రోడ్డు పక్కన ‘ఝల్మురి’ అమ్ముతున్న బిక్రమ్ సౌ దుకాణం వద్ద అకస్మాత్తుగా ఆగింది. అక్కడ బిక్రమ్ స్వయంగా తయారుచేసిన ఝల్మురిని ప్రధాని మోడీ ఆస్వాదించి, అతనితో కొద్దిసేపు మాట్లాడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బిక్రమ్ ఒక్కసారిగా ప్రజాదరణ పొందాడు.
వైరల్ అయిన తర్వాత మొదలైన బెదిరింపులు
అయితే, సోషల్ మీడియాలో గుర్తింపు పెరిగిన కొద్దిరోజులకే పరిస్థితి మారిపోయిందని బిక్రమ్ సౌ చెబుతున్నాడు. తన మొబైల్ ఫోన్కు పాకిస్థాన్, బంగ్లాదేశ్ నంబర్ల నుంచి వరుసగా కాల్స్, వాట్సాప్ వీడియో కాల్స్ వస్తున్నాయని ఆయన ఆరోపించాడు. ఈ కాల్స్లో తనను, తన కుటుంబ సభ్యులను తీవ్ర పరిణామాలతో బెదిరిస్తున్నారని, కొందరు చంపేస్తామని కూడా హెచ్చరిస్తున్నారని ఆయన తెలిపాడు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని సమాచారం.
పోలీసులకు ఫిర్యాదు
ఈ ఘటనపై బిక్రమ్ సౌ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతర్జాతీయ నంబర్ల నుంచి వచ్చిన కాల్స్ వివరాలను సేకరిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కూడా కలకలం రేపింది. సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ కావడం ఒక సాధారణ దుకాణదారుడి జీవితాన్ని ఎలా మార్చేసిందో ఈ ఘటన చూపిస్తోంది. మరోవైపు.. ఝార్గ్రామ్ ప్రాంతంలో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక సాధారణ వ్యక్తి ప్రధానమంత్రికి తినుబండారం వడ్డించిన కారణంగా ఇలాంటి బెదిరింపులు ఎదుర్కోవాల్సి రావడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి బాధిత కుటుంబానికి భద్రత కల్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
