Vinod Tawde: 2027 మొదట్లో జరగబోతున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం అంతా సిద్ధమైంది. బీజేపీతో పాటు ప్రతిపక్షాలు ఇప్పటికే ఎన్నిలక ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఇదిలా ఉంటే , యూపీలో మూడోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ కీలక స్ట్రాటజిస్ట్ను రంగంలోకి దించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ వినోద్ తావ్డేను బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ ఉత్తర్ ప్రదేశ్ ఇన్చార్జ్గా నియమించారు. జగదీశ్ ఈశ్వర్భాయ్ పటేల్ను యూపీ కో-ఇన్చార్జ్గా నియమించారు.
రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ స్థాయికి..
63 ఏళ్ల వినోద్ తావ్డే ఓబీసీ నేతగా బీజేపీలో కీలకంగా ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన ఈయన రాష్ట్ర సంస్థాగత వ్యవస్థలో క్రమంగా ఎదిగారు. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో పాఠశాల విద్యా, ఉన్నత సాంకేతిక విద్యా మంత్రిగా పనిచేశారు. వీటితో పాటు వైద్య విద్య, క్రీడలు-యువజన సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక వ్యవహారాలు వంటి కీలక శాఖలను నిర్వహించారు.
అయితే, 2019 ఎన్నికల్లో బీజేపీ తావ్డేకు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన రాష్ట్ర రాజకీయాల నుంచి దూరమయ్యారు. దీని తర్వాత తావ్డే జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లారు. 2022 రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల ప్రచారానికి ఇన్చార్జ్గా పనిచేశారు. వివిధ రాష్ట్రాల్లో పార్టీలు, మిత్రపక్షాలతో సమన్వయం చేస్తూ ముర్ముకు మద్దతు కూడగట్టడంలో కీలక పాత్ర పోషించారు. 2025లో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్ కోసం కూడా పనిచేశారు.
2022లో బీహార్ బీజేపీ ఇన్ఛార్జ్గా నియమితులైన తావ్డే, కీలక వ్యూహాకర్తగా ఎదిగారు. ఆయన నాయకత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి రావడానికి బీహార్ కీలకంగా నిలిచింది.త్రిపుర, రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎంపికల్లో పరిశీలకుడిగా కూడా తావ్డే వ్యవహరించారు. గుజరాత్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తరాఖండ్, ఢిల్లీలో ఎన్నికల వ్యూహం, సంస్థాగత వ్యవహారాలను కూడా నిర్వహించారు.
యూపీలో బీజేపీ గెలుపే టార్గెట్..
2029 లోక్సభ ఎన్నికలకు ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి. యూపీలో ఎవరు అధికారంలోకి వస్తే వారు, 2029 సాధారణ ఎన్నికల్లో సత్తా చాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తావ్డేను యూపీ ఎన్నికలకు ముందు ఇన్ఛార్జ్గా నియమించారు. ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలు, 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ యూపీలో తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి.
సునీల్ బన్సల్ వెళ్లిపోయిన తర్వాత యూపీలో బీజేపీకి సంస్థాగతంగా పట్టు పోయిందనే భావన నెలకొంది. మాజీ కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ ఇన్చార్జ్గా ఉన్నప్పటికీ, బలమైన పూర్తి స్థాయి సంస్థాగత లోటు కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో తావ్డే యూపీ బాధ్యతలు చేపట్టారు. వివిధ వర్గాలతో పనిచేయడం, పార్టీలోని భిన్న అభిప్రాయాలను వినడం, అంతర్గత విభేదాలు బహిరంగం కాకుండా చూడగల సామర్థ్యం తావ్డేకు ఉన్నాయని పార్టీ నేతలు భావిస్తున్నారు.

