Vice President: మాతృభాషను కాపాడేందుకు ఐదు సూత్రాలు అవసరం

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన భారత్ భారతి భాషా మహోత్సవ్ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే అందాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. మన మూలాలు, సంస్కృతిని తెలియజెప్పి ముందుకు నడిపించే సారథే భాష అని పేర్కొన్నారు. భాష అనేది మన అస్థిత్వాన్ని చెప్పడమే కాకుండా ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. తరతరాలుగా మన పూర్వీకులు మన సంస్కృతిని మన భాషలోనే నిక్షిప్తం చేశారన్నారు.

మాతృభాషను కాపాడేందుకు ఐదు సూత్రాలు అవసరమ‌ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. పరిపాలనా భాషగా మాతృభాషకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. న్యాయస్థాన కార్యకలాపాలు, తీర్పులు మాతృభాషలో ఇచ్చేందుకు చొరవ చూపాల‌ని పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో మాతృభాష వినియోగించాలన్నారు. కుటుంబ స‌భ్యుల‌తో అంద‌రూ మాతృభాషలోనే మాట్లాడాలని చెప్పారు. ఒకే భాష‌కు చెందిన వారు త‌మ‌ భాష‌లోనే మాట్లాడుకోవాల‌ని వెంకయ్యనాయుడు సూచించారు.