తొలి విడత అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

ఉత్తర ప్రదేశ్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ అధికారులు శుక్రవారం నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 10న ఎన్నికలు జరగనున్నాయి. కాగా తొలి విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలు విడుదల చేయగా.. బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది.

Read Also: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం

125 మందితో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా… అందులో కొందరు జర్నలిస్టులు, ఓ నటి, సామాజిక కార్యకర్తలు కూడా ఉన్నారు. ప్రియాంక గాంధీ విడుదల చేసిన అసెంబ్లీ ఎన్నికల జాబితాలో 40 శాతం మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. మీరట్‌లోని హస్తినాపూర్ అసెంబ్లీ స్థానానికి మిస్ బికినీ-2018 అర్చన గౌతమ్‌ను ప్రియాంక గాంధీ ఎంపిక చేశారు. గత ఏడాది నవంబరులో అర్చన గౌతమ్ కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆమెకు అసెంబ్లీ టిక్కెట్ కేటాయించడం గమనార్హం.