Tulsi Gabbard: ‘‘ఉగ్ర వేటలో భారత్‌కి అమెరికా అండ’’.. యూఎస్ స్పై చీఫ్ తులసీ గబ్బర్డ్..

  • ఉగ్రవాదుల వేటలో భారత్‌కి అమెరికా అండగా ఉంటుంది..
  • పహల్గామ్ దాడిని ఖండించిన యూఎస్ నిఘా సంస్థల అధిపతి తులసీ గబ్బర్డ్..
Tulasi Gabbard

Tulasi Gabbard

Tulsi Gabbard: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర ఘటనపై యావత్ ప్రపంచం భారత్‌కి అండగా నిలుస్తుంది. పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు 26 మంది అమాయకపు టూరిస్టులను కిరాతకంగా కాల్చి చంపారు. మతం ఆధారంగా, హిందువుల్ని టార్గెట్ చేసి హత్య చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే, ప్రపంచ దేశాల నాయకులు, ప్రధాని మోడీకి ఫోన్ చేసి సంఘీభావం ప్రకటించారు. ఉగ్రవాద అణిచివేతలో తాము భారత్‌కి అండగా నిలబడుతామని చెప్పారు.

తాజాగా, అమెరికా గూఢచార సంస్థల అధినేత తులసీ గబ్బర్డ్ పహల్గామ్ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల వేటలో భారత్‌కి అండగా ఉంటామని చెప్పారు. శుక్రవారం తులసీ ఇస్లామిక్ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ, నేరస్తుల్ని వేటాడేటప్పుడు అమెరికా భారత్‌కి మద్దతు ఇస్తుందని అన్నారు.

Read Also: Pakistan: భారత్‌కి వ్యతిరేకంగా పాక్ పార్లమెంట్‌లో తీర్మానం..

‘‘పహల్గామ్‌లో 26 మంది హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్య చేసిన భయంకరమైన ఇస్లామిక్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో మేము భారతదేశానికి సంఘీభావం తెలియజేస్తున్నాము. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరియు భారతదేశ ప్రజలందరికీ నా న సానుభూతి. ఈ దారుణమైన దాడికి కారణమైన వారిని మీరు వేటాడేటప్పుడు మేము మీతో ఉన్నాము మరియు మీకు మద్దతు ఇస్తున్నాము’’ అని ట్వీట్ చేశారు.

అంతకుముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ‘‘కాశ్మీర్ నుండి తీవ్ర కలతపెట్టే వార్త. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా భారతదేశంతో బలంగా నిలుస్తుంది. కోల్పోయిన వారి ఆత్మల కోసం,గాయపడిన వారి కోలుకోవడం కోసం మేము ప్రార్థిస్తున్నాము. ప్రధాన మంత్రి మోడీ, భారతదేశంలోని అద్భుతమైన ప్రజలకు మా పూర్తి మద్దతు మరియు ప్రగాఢ సానుభూతి ఉంది’’ అని ఆయన ట్రూత్ సోషల్‌లో రాశారు.