Uttar Pradesh survey: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే గడువు ఉంది. వచ్చే ఏడాది 2027 తొలిభాగంలో యూపీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే బీజేపీ, ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)లు తమ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇదే సమయంలో పలు ఎలక్షన్ సర్వేలు బయటకు వచ్చాయి. ఈ సర్వేల్లో ఆసక్తికర ఫలితాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల కన్నా, తమ ఎమ్మెల్యేలపైనే ఓటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి, అధికార పార్టీకి ఓటర్లు ఇప్పటికీ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడైంది.
ఓట్ వైబ్ నిర్వహించిన సర్వే ప్రకారం.. యూపీలో దాదాపుగా సగం మంది ఓటర్లు ప్రస్తుత ఎమ్మెల్యేలపై కోపంతో ఉన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు, సీఎంకు సపోర్ట్ చేస్తున్నారు. ఓట్ వైబ్ సర్వే ప్రకారం.. ముఖ్యంగా యూపీ ఎమ్మెల్యేలపై ఓటర్ల అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోంది. 49 శాతం మంది ప్రస్తుత ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం 27.9 శాతం మంది తమ ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే, సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. 41.8 శాతం మంది ప్రజల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేయగా, 38.4 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి స్వల్పంగా పాజిటిల్ రేటింగ్ ఉంది. యూపీలో నిరుద్యోగం అతిపెద్ద ఎన్నికల అంశంగా నిలిచింది. 23.1 శాతం మంది దీనిని ప్రధాన సమస్యగా పేర్కొన్నారు. రైతుల సమస్యలు 14.1 శాతం, విద్య-వైద్యం 13.7 శాతం, ద్రవ్యోల్బణం 12.2 శాతం, అవినీతి, రామమందిర విరాళాల వివాదం 11.4 శాతం ఓట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఓటింగ్ విషయానికి వస్తే బీజేపీ కూటమికి 41.8 శాతం ఓట్లు వస్తే, ఎస్పీ కూటమికి 38.7 శాతం వస్తుందని అంచనా వేసింది. ఎవరు గెలుస్తారని అడినప్పుడు మాత్రం 41.2 శాతం మంది ఎస్పీ కూటమికి జై కొట్టగా, 41.1 శాతం మంది బీజేపీ గెలుస్తుందని అంచనా వేశారు. సీఎం అభ్యర్థిగా 43.4 శాతంతో యోగి ముందుండగా, 35.5 శాతంతో రెండో స్థానంలో అఖిలేష్ యాదవ్ ఉన్నారు.

