Parking: పార్కింగ్ కోసం గొడవ.. కార్లుతో ఈడ్చుకెళ్లి హత్య..

Parking

Parking

Parking: ఇటీవల కాలంలో పార్కింగ్ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు భౌతికదాడుల వరకు వెళ్తున్నాయి. తాజాగా న్యూ ఇయర్ రోజు పార్కింగ్ వాగ్వాదం ఒకరి మరణానికి కారణమైంది. ఘజియాబాద్‌లోని మోడీ నగర్‌లో పార్కింగ్ వివాదంతో కోపం పెంచుకున్న ఓ వ్యక్తి తన ఎస్‌యూవీ కార్‌తో 30 ఏళ్ల వ్యక్తిని 100 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో సదరు వ్యక్తి మరణించినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు రాహుల్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడితో పాటు అతని నలుగురు సహచరులు మద్యం సేవించి ఉన్నారని, ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు డీసీసీ వివేక్ చంద్ర యాదవ్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ 31న జనసేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్న అనుపమ్ శ్రీవాస్తవ తన స్నేహితుడి అరుణ్‌తో కలిసి మోడీనగర్ లోని హర్ముఖ్ పూరి మార్కెట్‌లో స్నాక్స్ తీసుకునేందుకు వెళ్లారు.

Read Also: Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి, 25 మందికి గాయాలు..

శ్రీవాస్తవ కారుని ఒక ప్రాంతంలో పార్క్ చేశారు, అరుణ్ కారులోనే ఉన్నాడు. వీరి కారు ముందు నిందితుడు రాహుల్ చౌదరి ఎస్‌యూవీ ఆగి ఉంది. అయితే అరుణ్ తమ కారు ముందు ఉన్న ఎస్‌యూవీ తీయాలని హారన్ కొట్టాడు. రాహుల్ చౌదరి మద్యం మత్తులో కోపంతో ఊగిపోతూ, శ్రీవాస్తవను తిట్టాడు. స్థానికులు జోక్యంతో అక్కడితో గొడవ సద్దుమణిగింది.

చౌదరి అక్కడి నుంచి వెళ్లిపోయి, తన స్నేహితులతో కలిసి వచ్చి శ్రీవాస్తవపై దాడికి పాల్పడ్డాడు. తన ఎస్‌యూవీ కారుతో శ్రీవాస్తవను 100 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. తీవ్రగాయాలపాలైన అతను ఆస్పత్రికి తీసుకెళ్లే సరికి చనిపోయాడు. నిందితుడి స్నేహితులు, శ్రీవాస్తవను చంపేయాలని నిందితుడు చౌదరిని రెచ్చగొట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యానేరాన్ని నమోదు చేసి, ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు.